సైడ్ ఇవ్వలేదని కాల్చేశాడు: సీఎం కుమారుడికి ఐదేళ్ల జైలుశిక్ష
ఓవర్టేక్ చేయనివ్వలేదన్న కారణంగా ఓ వ్యక్తిని నడిరోడ్డుపై కాల్చి చంపిన కేసులో మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కుమారుడు అజయ్ మితయ్కు శిక్ష పడింది.
ఇంఫాల్: ఓవర్టేక్ చేయనివ్వలేదన్న కారణంగా ఓ వ్యక్తిని నడిరోడ్డుపై కాల్చి చంపిన కేసులో మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కుమారుడు అజయ్ మితయ్కు శిక్ష పడింది. ఈ కేసులో నేడు విచారణ చేపట్టిన మణిపూర్ ట్రయల్ కోర్టు అజయ్ను దోషిగా తేల్చింది. అతడికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
2011 మార్చి 20న ఇరోమ్ రోజర్ అనే వ్యక్తితో కారు విషయంలో గొడవపడ్డాడు. అజయ్. రోజర్ తన కారులో ముందు వెళ్తుండగా.. అజయ్ తన ఎస్యూవీతో ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే రోజర్ పక్కకు తప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన అజయ్.. కారును రోజర్ వాహనం ముందు ఆపి.. అతడిపై కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో రోజర్ చనిపోయాడు. దీంతో అజయ్పై కేసు నమోదైంది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు.. ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. కాగా, ప్రభుత్వం నుంచి తమకు హాని ఉందని మృతుడు రోజర్ కుటుంబసభ్యులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది.