గల్ఫ్పై గర్జిస్తున్న అమెరికా..! సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..! ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్..!!
రియాద్/హైదరాబాద్ : ఇరాన్పై అమెరికా ఆంక్షలు, అగ్రరాజ్య యుద్ధ నౌకల మోహరింపు నేపథ్యంలో గల్ఫ్లో పరిస్థితులు ఉద్రిక్త రూపం దాల్చుతున్నాయి. గత రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. సౌదీ అరేబియాలోని చమురు సరఫరా వ్యవస్థల ధ్వంసానికి యత్నం, సముద్ర జలాల్లో ఆయిల్ ట్యాంకర్లపై అంతుచిక్కని దాడులు..ఈ క్రమంలోనే ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించటం పరిస్థితులను ఏ దిశగా తీసుకువెళ్తాయోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..! యుద్ద నౌకలను మొహరిస్తున్న యూఎస్..!!
అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియాలోని చమురు గొట్టపు మార్గంపై మంగళవారం డ్రోన్ దాడులు జరిగాయి. దేశంలోని తూర్పు ప్రాంత చమురు క్షేత్రాల నుంచి పశ్చిమాన ఉన్న ఎర్ర సముద్ర తీర నౌకా నగరం యన్బుకు ముడి చమురును తరలించే ఈ గొట్టపు మార్గం(పైప్లైన్) పొడవు 1200 కిలోమీటర్లు. రోజుకు 50లక్షల బారెళ్ల చమురును దీని ద్వారా తరలిస్తుంటారు. దాడుల్లో పంపింగ్ కేంద్రం దెబ్బతినటంతో చమురు కంపెనీ ‘సౌదీ ఆర్మాకో' సరఫరాను నిలిపివేసి పునరుద్ధరణ పనులు చేపట్టిందని సౌదీ అరేబియా ఇంధనశాఖ మంత్రి ఖలీద్ అల్ ఫాలిహ్ తెలిపారు.
సౌదీ అరేబియా చమురు సరఫరాలపై దాడులు..! సముద్ర జలాల్లో కి ఆయిల్..!!
దాడులకు పాల్పడింది తామేనని హుతి తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. వీరు ఇరాన్ మద్దతుదారులు కావటం గమనార్హం. చమురు రవాణాను అడ్డుకోవటం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్నది ఉగ్రవాదుల కుట్ర అని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆరోపించింది. అయితే యెమెన్ ప్రజలపై కొనసాగుతున్న అణచివేతకు నిరసనగానే డ్రోన్ దాడులు జరుపుతున్నట్లు హుతి తిరుగుబాటుదారులు ప్రకటించారు.
అనుమానాలు పెంచిన దాడి..! ఇరాన్ పై అమెరికా ఆరోపణలు..!!
సోమవారం గల్ఫ్ జలాల్లో చమురు ట్యాంకర్లపై దాడులు జరిగాయి. అయితే, ఈ దాడులు జరిపింది ఎవరనేది అంతుచిక్కలేదు. దెబ్బ తిన్న నాలుగు ట్యాంకర్లలో సౌదీ అరేబియాకు చెందినవి రెండు కాగా, యూఏఈ, నార్వేకి చెందినవి ఒక్కొక్కటి ఉన్నాయి. ఇరాన్ ఈ దాడులు జరిపించిందని అమెరికా, దాని మిత్ర దేశాలు నేరుగా ఆరోపించనప్పటికీ, ఇరాన్ ప్రమేయంపై అవి సందేహంతోనే ఉన్నాయి.
ఇరాన్ హెచ్చరించిన అమెరికా..! తీవ్ర పరిణామాలు తప్పవంటూ బెదిరింపులు..!!
చమురు ట్యాంకర్లపై దాడిని ఇరాన్ కూడా ఖండించింది. గల్ఫ్లో అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం ఇరాన్ను హెచ్చరించారు. ఇరాన్ దాడికి సిద్ధమవుతోందనే సమాచారం ఉందని అమెరికా నిఘా వర్గాలు పునరుద్ఘాటించాయి. ఇరాన్పై ఒత్తిడి పెంచే దిశగా ఆయుధ వ్యవస్థలను అమెరికా మోహరిస్తోంది.