90 సెకండ్లలో పంజాబ్ బ్యాంకు లూటీ
లూథియానా: బ్యాంకులో నగదు లూటీ చెయ్యడానికి కేవలం 90 సెకండ్లు సమయం తీసుకున్న దుండగులు దర్జాగా అక్కడి నుంచి పారిపోయారు. కోచర్ మార్కెట్ పోలీస్ స్టేషన్ ఔట్ పోస్టుకు కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులో నగదు లూటీ చేశారు.
పంజాబ్ లోని లూథియానాలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో సోమవారం పట్టపగలు ఈ దోపిడి చేశారు. పోలీసుల కథనం మేరకు సోమవారం మధ్యాహ్నం నలుగురు ముసుగులు వేసుకున్న దుండగులు మొదటి అంతస్తులో ఉన్నబ్యాంకులోకి వెళ్లారు.
బ్యాంకులో అడుగు పెట్టడం ఆలస్యం గాల్లోకి కాల్పులు జరిపారు. బ్యాంకులో ఓ కస్టమర్, ఆరు మంది బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు. ఒక దుండగుడు బ్యాంకులో ఉన్నఅంకుష్ చౌదరి అనే కస్టమర్ ను చితకబాదాడు.
మరో దుండగుడు క్యాషియర్ తలకు తుపాకి గురి పెట్టాడు. ఇంకో దుండగుడు బ్యాంకు మేనేజర్ ను నిర్బంధించాడు. మరో దుండగుడు క్యాషియర్ వెనక్కు వెళ్లి ఉదయం డిపాజిట్ అయిన రూ. 15 లక్షలు లూటీ చేశాడు.
అదే సమయంలో బ్యాంకులోకి ఓ మహిళ ప్రవేశించింది. విషయం గుర్తించి ఆమె బయటకు పరుగు తీసి చుట్టు పక్కల వారికి విషయం చెప్పింది. స్థానికులు బ్యాంకులోకి వచ్చే సమయానికి దుండగులు అక్కడి నుంచి దర్జాగా వెళ్లి పోయారు.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బ్యాంకు ఉద్యోగుల సహకారంతోనే బ్యాంకులో రూ. 15 లక్షలు లూటీ అయ్యిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకులో సెక్యూరిటీ గార్డు లేడని పోలీసు అధికారులు చెప్పారు. బ్యాంకులో సెక్యూరిటీ గార్డును పెట్టుకోవాలని చాల సార్లు బ్యాంకు మేనేజర్ కు చెప్పామని, అయినా వారు పట్టించుకోలేదని పోలీసు అధికారులు తెలిపారు.