రూ. 26 లక్షలు క్యాష్: ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లారు
జైపూర్: నగదు లూటీ చెయ్యడానికి వెళ్లిన నిందితులు వీలు కాకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్ ను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న రాజస్థాన్ పోలీసులు నాకాబందీలో పలు వాహనాలు పరిశీలించినా నిందితుల ఆచూకి చిక్కలేదు.
జైపూర్ కు 65 కిలోమీటర్ల దూరంలోని బైన్ స్వా ప్రాంతంలో జాతీయ బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రం ఉంది. సోమవారం అర్దరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని దుండగులు ఏటీఎం కేంద్రం దగ్గరకు వెళ్లారు.
తరువాత మిషన్ పగలగొట్టి నగదు లూటీ చెయ్యడానికి విఫలయత్నం చేశారు. వీలు కాకపోవడంతో ఏటీఎం యంత్రం ఎత్తుకెళ్లారు. మంగళవారం వేకువ జామున 2.30 గంటల సమయంలో విషయం గుర్తించిన సెక్యూరిటి గార్డు పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు పలు చోట్ల అనేక వాహనాలు పరిశీలించారు. అయితే ఏటీఎం మిషన్ చిక్కలేదు. ఏటీఎం మిషన్లో రూ. 26.76 లక్షలు ఉందని బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.