కేఎఫ్ సీ పిజ్జా సెంటర్ లో యువకుడి దారుణ హత్య, రచ్చ, అడ్డుకున్నాడు, కత్తులతో!
బెంగళూరు: ప్రసిద్ది చెందిన కేఎఫ్ సీ పిజ్జా సెంటర్ లో నగదు లూటీ చెయ్యడానికి వెళ్లిన దండగులు అమాయకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలోని హెబ్బగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బెంగళూరులో ఉద్యోగం
ఒరిస్సాకు చెందిన సమీర్ (25) బెంగళూరు చేరుకుని హోసూరు జాతీయ రహదారిలోని హెబ్బగుడి సమీపంలోని కేఎఫ్ సీ పిజ్జా సెంటర్ లో వెయిటర్ బాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి సమీర్ విధుల్లో ఉన్నాడు.
క్యాష్ కౌంటర్
ఆ సమయంలో నలుగురు వ్యక్తులు బైక్ ల్లో అక్కడికి వెళ్లారు. తరువాత కేఎఫ్ సీ పిజ్జా సెంటర్ లో చొరబడి భీభత్సం చేశారు. క్యాష్ కౌంటర్ లో ఉన్న నగదు, మొబైల్ లూటీ చెయ్యడానికి ప్రయత్నించారు. సమీర్ వారిని అడ్డుకోవడంతో సహనం కొల్పోయిన దుండగులు కత్తులతో అతని మీద దాడి చేశారు.
నగదు లూటీ
అనంతరం నగదు, మొబైల్ లాక్కొని అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. తీవ్రగాయాలైన సమీర్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై సమీర్ మరణించాడని హెబ్బగుడి పోలీసులు తెలిపారు.
సీసీ కెమెరాలు
బెంగళూరు-హోసూరు జాతీయ రహదారిలో ప్రతినిత్యం వందల సంఖ్యలో వాహనాలు సంచరిస్తుంటాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న కేఎఫ్ సీ పిజ్జా సెంటర్ లో హత్య జరగడంతో స్థానికులు హడలిపోయారు. కేఎఫ్ సీ పిజ్జా సెంటర్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.