మెట్రో ఉద్యోగిని కత్తులతో పొడిచి... 12 లక్షలతో పరారీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ఢిల్లీలోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్లో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి, మెట్రో ఉద్యోగిని స్టేషన్ ఆవరణలోనే పొడిచేసి రూ.12 లక్షలతో అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.... రాజేంద్ర నగర్లోని మెట్రో స్టేషన్లోకి నేరుగా ప్రవేశించిన నిందితులు కంట్రోల్ రూంలోకి వెళ్లారు. అక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉండటం విశేషం.
శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు దినాలు కావడంతో నగదు స్టేషన్లోని టికెట్ కౌంటర్లో ఉంటుందని నిందితులకు ముందుగానే తెలిసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం ఉదయాన్నే మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కావడానికి ముందే కత్తులతో లోపలికి ప్రవేశించారు.
సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది నిత్యం కాపలా కాసే ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఈ సంఘటన జరగడం మెట్రో భద్రతా చర్యల్లో డొల్లతనం బయట పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దాడి వ్యవహారం సీసీ టీవీ కెమెరాలలో రికార్డు అయిందో లేదో మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.