నన్ను చావనివ్వండి: రాజీవ్ హత్య కేసు నిందితుడి విన్నపం
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న రాబర్ట్ పియూస్ తన కారుణ్య మరణానికి అనుమతించాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. తన విజ్ఞప్తిని మన్నించి తనకు విముక్కినివ్వాలంటూ జైలు అధికారులకు ఓ లేఖ రాశాడు.
రాజీవ్ గాంధీ హత్య కేసులో రాబర్ట్ కూడా కీలక నిందితుడు. అయితే ఇప్పటికే అతడికి జీవిత ఖైదు పడగా 26ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రాబర్ట్తో సహా ఈ కేసులోని మొత్తం ఏడుగురు నిందితులను సత్ప్రవర్తన విడుదల చేయాలని నిర్ణయించగా, దాన్ని సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో వారి విడుదల ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో ఇక తనకు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ అతడు పిటిషన్ పెట్టుకున్నారు. రాబర్ట్ శ్రీలంకకు చెందిన తమిళుడు. 1980లో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్(ఐపీకేఎఫ్) బలగాలు చేసిన వేధింపుల్లో తన కుమారుడు చనిపోయాడనే ఆగ్రహంతో రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు చేసిన కుట్రలో అతడు భాగస్వామి తేలడంతో అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. 1991 మే నెలలో రాజీవ్ హత్య జరిగిన విషయం తెలిసిందే. కాగా, 'అతడు(రాబర్ట్ పియూస్) రాసిన లేఖ ద్వారా మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. దీనిని రాష్ట్ర డీజీపీ ద్వారా హోంశాఖకు పంపిస్తాం. ఈ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున కేంద్రమే ఈ విషయం తేల్చాల్సి వుంది' అని రాబర్ట్ లేఖపై జైలు అధికారి వివరణ ఇచ్చారు.