విచారణ కోసం ఈడీ కార్యాలయానికి రాబర్ట్ వాద్రా... అతనితో పాటు ఇంకెవరొచ్చారంటే..?
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. వాద్రాతో పాటు అతని భార్య కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా వచ్చారు. విదేశీ ఆస్తులను అక్రమంగా కొనుగోలు చేశారనే అభియోగాలు వాద్రా ఎదుర్కొంటున్నాడు. వాద్రాను ఈడీ దాదాపు 40 ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈడీ సంధించే ప్రశ్నలకు వాద్రా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వాద్రాను ఈడీ ప్రశ్నిస్తున్న సమయంలో అతని తరుపున న్యాయవాది మరో గదిలో ఉంటారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈడీ విచారణకు సహకరించాలని ఢిల్లీ కోర్టు వాద్రాకు చురకలంటించింది. ముందస్తు బెయిల్కోసం వాద్రా కోర్టును ఆశ్రయించడంతో విచారణకు హాజరుకావాల్సిందే అంటూ వాద్రాకు తెలిపింది. అంతేకాదు గతవారమే ఫిబ్రవరి 16వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అంతవరకు వాద్రా విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని పేర్కొంది. ఇక ఫిబ్రవరి 19వ తేదీవరకు రాబర్ట్ వాద్రాను అరెస్టు చేయరాదని కూడా కోర్టు అధికారులకు స్పష్టం చేసింది.
లండన్కు చెందిన ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్కు రాబర్ట్ వాద్రా పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయన్ను ఈడీ విచారణ చేస్తోంది. లండన్లో వాద్రా పేరిట చాలా ఆస్తులు ఉన్నాయని విచారణ సందర్భంగా తెలిసిందని ఈడీ కోర్టుకు తెలియజేసింది. ఇదులో రెండు ఇళ్లు, ఆరు ఇతర ఫ్లాట్లు కూడా ఉన్నట్లు ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే తాను వ్యక్తిగతంగా ఈడీ విచారణకు హాజరై తన ఆస్తుల వివరాలను వెల్లడించాలని తాము కోరుతున్నామని ఆ మేరకు వాద్రాకు ఆదేశాలు ఇవ్వాలని ఈడీ తెలిపింది. రాజకీయంగా తనపై కక్షగట్టి లేనిపోని కేసులు బనాయించారని వాద్రా ఆరోపించారు.