11 సార్లు 70 గంటలు ప్రశ్నించారు: ఇది రాజకీయ కక్ష సాధింపే అన్న రాబర్ట్ వాద్రా
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా గురువారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ఆయన భార్య యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ ఈడీ కార్యాలయం వద్ద డ్రాప్ చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ వాద్రాకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే వాద్రా ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఇప్పటి వరకు తనను 70 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ అధికారులు విచారణ చేశారని వాద్రా ఓ ఫేస్బుక్ పోస్టు ద్వారా తెలిపారు.
లండన్లో కొన్న ఆస్తులు, దుబాయ్, రాజస్థాన్, రాజధాని ప్రాంతంలో ఆస్తుల కొనుగోలుపై గురువారం రాబర్ట్ వాద్రాను విచారణ చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణకు ఈడీ అధికారులు పిలువడం ఇది తొమ్మిదవసారి కావడం విశేషం. ఇప్పటి వరకు తనను 70 గంటల పాటు విచారణ చేశారని... తను ఎలాంటి తప్పుచేయలేదని రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో పోస్టు చేశారు. అన్ని ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తాననే విశ్వాసం వ్యక్తం చేసిన వాద్రా తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని అన్నారు. మరోవైపు ఈడీ అధికారులకు ఎప్పటిలాగే తన వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు తన భర్తకు కష్టకాలంలో కచ్చితంగా అండగా ఉంటానని ప్రియాంకా గాంధీ చెప్పారు. రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని వాద్రా మండిపడ్డారు.
ఇదిలా ఉంటే రాబర్ట్ వాద్రా మనీలాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు లండన్లో 12 మిలియన్ పౌండ్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఇందులో మూడు విల్లాలు, మిగతావి విలాసవంతమైన ఫ్లాట్లుగా గుర్తించింది. ఇవ్వనీ 2005 నుంచి 2010లో వాద్రా కొన్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నింది. రాబర్ట్ వాద్రా విచారణకు సహకరించడం లేదని ఆయన్ను కస్టడీలోకి తీసుకుంటామని ఆమేరకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. బినామీ కేసులో కొత్త ఆధారాలు లభించాయని అందుకే విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Delhi: Robert Vadra arrives at the office of Enforcement Directorate in connection with a money laundering case. pic.twitter.com/DF5eJJhWGY
— ANI (@ANI) May 30, 2019