రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా, మోరాబాద్ నుంచి పోటీ, ఎందుకంటే?
మోరాదాబాద్: తాను రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల హింట్ ఇచ్చిన రాబర్ట్ వాద్రా తాజాగా గురువారం మరో హింట్ ఇచ్చారు. ఆయన సతీమణి ప్రియాంక గాంధీ గత నెలలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత వాద్రా కూడా రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. తాను ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్ లోకసభ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అర్థం వచ్చేలా మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయ నాయకుడే అయి ఉండాల్సిన అవసరం లేదని, కానీ, నేను మార్పు తీసుకురాగలనని ప్రజలు భావిస్తే, నేను రాజకీయాల్లో వస్తానని చెప్పారు.
ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. తాను మొరాదాబాద్లో జన్మించానని, తన బాల్యం ఉత్తర్ ప్రదేశ్లోనే గడిచిందని, తాను ఈ ప్రాంతం గురించి బాగా అర్థం చేసుకోగలనని, ఏదేమైనా, తాను ఏ ప్రాంతంలోనయినా ఉండగలనని, అందరిని అర్థం చేసుకోగలనని చెప్పారు.
తనపై ఉన్న మనీలాండరింగ్ కేసు విషయమై కూడా స్పందించారు. తాను చట్టానికి కట్టుబడి ఉంటానని, విచారణకు ఎక్కడికి పిలిస్తే వెళతానని, నేను ఏ విషయాన్నీ దాచాల్సిన అవసరం లేదన్నారు. తన మీద ఉన్న ఆరోపణలన్నీ తొలగిపోయే వరకు తాను దేశాన్ని విడిచి ఎక్కడికీ వెళ్లనని చెప్పారు.
కాగా, ఐదు రోజుల క్రితం రాబర్ట్ వాద్రా తన ఫేస్బుక్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రచార కార్యక్రమాలతో పాటు ఇతర పనుల్లో ఉన్నానని, ఆ క్రమంలో తనపై ప్రజలు చూపిన ప్రేమ, ఆదరణ తనను ఆకట్టుకున్నాయని, అందుకే ప్రజలకు ఇంకా ఏదో చేయాలని భావిస్తున్నానని, తనకు సాధ్యమైనంత వరకు వ్యవస్థలో మార్పు తీసుకు రావాలని అనుకుంటున్నానని, ఇప్పటి వరకు తాను నేర్చుకున్న దానిని వృథాగా పోనివ్వనని, ఏదో మంచి కోసం ఉపయోగిస్తానని, ప్రస్తుతం తనపై ఉన్న ఆరోపణలు తొలగిపోతే ప్రజాసేవలో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నానని తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్నారు.
మరో కామెంట్ కూడా పెట్టారు. ప్రజలకు మేలు చేసేందుకు తాను రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదని, కానీ నేను చేరితే మాత్రం మార్పు తీసుకు వస్తామని, ఎందుకు చేయలేనని, అయితే దానిని ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. కాగా, ప్రజలు కోరుకుంటే తాను రాజకీయాల్లోకి వస్తానని 2012లోను రాబర్ట్ వాద్రా చెప్పారు.