ప్రియాంక గాంధీ తర్వాత.. రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా?: అలా హింట్ ఇచ్చారు
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె తర్వాత ఆమె భర్త రాబర్డ్ వాద్రా కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నారా? అనే చర్చ సాగుతోంది. ఇందుకు ఆయన తన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ నిదర్శనం అని అంటున్నారు.
ప్రియాంక గాంధీ నిన్నటి వరకు తన తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీకి అండగా మాత్రమే నిలబడ్డారు. కానీ ఈ నెలలోనే ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ప్రియాంక తర్వాత వాద్రా కూడా రాజకీయాల్లో కీ రోల్ పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మేరకు ఆదివారం రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో ఆసక్తికర పోస్టు పెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రచార కార్యక్రమాలతో పాటు ఇతర పనుల్లో ఉన్నానని, ఆ క్రమంలో తనపై ప్రజలు చూపిన ప్రేమ, ఆదరణ తనను ఆకట్టుకున్నాయని, అందుకే ప్రజలకు ఇంకా ఏదో చేయాలని భావిస్తున్నానని, తనకు సాధ్యమైనంత వరకు వ్యవస్థలో మార్పు తీసుకు రావాలని అనుకుంటున్నానని, ఇప్పటి వరకు తాను నేర్చుకున్న దానిని వృథాగా పోనివ్వనని, ఏదో మంచి కోసం ఉపయోగిస్తానని, ప్రస్తుతం తనపై ఉన్న ఆరోపణలు తొలగిపోతే ప్రజాసేవలో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నానని తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్నారు.
మరో కామెంట్ కూడా పెట్టారు. ప్రజలకు మేలు చేసేందుకు తాను రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదని, కానీ నేను చేరితే మాత్రం మార్పు తీసుకు వస్తామని, ఎందుకు చేయలేనని, అయితే దానిని ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. కాగా, ప్రజలు కోరుకుంటే తాను రాజకీయాల్లోకి వస్తానని 2012లోను రాబర్ట్ వాద్రా చెప్పారు.
కాగా, అక్రమంగా ఆస్తుల కొనుగోలు, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాద్రా ఇప్పటికే పలుమార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శలు గుప్పించారు. నాలుగున్నరేళ్లలో గుర్తుకురాని కేసులు ఎన్నికల ముందే గుర్తుకు వచ్చాయని ఆగ్రహించారు.