సైకిల్పై ఆఫీసుకు వెళ్లిన రాబర్ట్ వాద్రా: పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసన, మోడీపై ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా తన కార్యాలయానికి సైకిల్పై వెళ్లారు. దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఆయన ఇలా చేశారు. అంతేగాక, ప్రధాని నరేంద్ర మోడీ ఏసీ కారులో నుంచి బయటికి వచ్చి ప్రజల బాధలు చూడాలని చెప్పుకొచ్చారు.
ఏసీ కార్ల నుంచి బయటికి వచ్చి ప్రధాని మోడీ ప్రజల బాధలను చూడాలి. అప్పుడే మీరు పెట్రోల్ ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తారు అంటూ రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలపైనే విమర్శలు చేయడం సరికాదని సూచించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త వాద్రా.
సూట్ వేసుకున్న వాద్రా.. హెల్మెట్ పెట్టుకుని సైకిల్పై ఖాన్ మార్కెట్ ప్రాంతం నుంచి అతని కార్యాలయానికి వెళ్లారు. అతని వెంట మరో ఇద్దరు కూడా ఉన్నారు. ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీసులు కూడా వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, వాద్రా వెనుకాల ఆయనకు సంబంధించిన వాహన శ్రేణి రావడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మీరు(రాబర్ట్ వాద్రా) సైకిల్ పై వస్తే.. వెనుకాల కార్లు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు.
Delhi: Robert Vadra rides bicycle from Khan Market to his office in protest against the rising fuel prices pic.twitter.com/kNtbDrRKQq
— ANI (@ANI) February 22, 2021
కాగా, ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పెట్రోల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రధాని మోడీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. క్రూడాయిల్ ధరలు పెరగకపోయినప్పటికీ దేశంలో చమురు ధరలు ఎందుకు పెరుగుతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక, పెట్రో ధరలు తగ్గించాలంటూ ప్రధాని మోడీకి సోనియా గాంధీ ఆదివారం మూడు పేజీల లేఖ కూడా రాశారు.
పెట్రోల్ లీటర్ ధర దేశంలో 100 రూపాయలకు చేరుకుందని, మోడీ ప్రభుత్వం బాగా పనిచేస్తోందంటూ రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. పేద ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయన్నారు.
కాగా, గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ. 90.58 ఉండగా, డీజిల్ ధర రూ. 80.97గా ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ ధర రూ. 100 దాటడం గమనార్హం.