తాగుబోతుల వల్ల చెల్లిని పోగొట్టుకున్నా: రాబర్ట్ వాద్రా
న్యూఢిల్లీ: హైవే పరిసరాల్లో లిక్కర్ సరఫరా అమ్మకాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించడంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో స్పందించారు.
తాగుబోతు డ్రైవర్ కారణంగా తన చెల్లిని పోగొట్టుకున్నానని చెప్పారు. తాజాగా వెలువరించిన కోర్టు తీర్పును సవరించాలంటూ లిక్కర్ కంపెనీలకు అనుకూలంగా స్పందించారు.
నిషేధం కారణంగా భారీ సంస్థలు, వాటిలో పని చేస్తున్న ఉద్యోగులకు నష్టం జరగకూడదనే ఇలా మాట్లాడుతున్నానన్నారు. 2001 ఏప్రిల్లో ఢిల్లీ జోథ్పూర్ హైవేపై మద్యం సేవించిన ఓ డ్రైవర్ కారణంగా వాద్రా చెల్లెలు మిచెల్లీ వాద్రా దుర్మరణం చెందారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న రాష్ట్ర, జాతీయ రాహదారుల పక్కన మద్యం సరఫరా, విక్రయాలు నిషేధిస్తూ తీర్పు చెప్పింది.
రహదారుల భద్రతకు ఈ నిర్ణయం మంచి ముందడుగు అని ఒప్పుకోవాల్సిందేనని, రోడ్డు భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోవడం వల్ల దురదృష్ట వశాత్తూ ఓ ప్రమాదంలో 33 ఏళ్ల తన సొంత సోదరిని కోల్పోయానని, హైవేల పక్కన మద్యం దుకాణాలను ఎత్తివేయడాన్ని సమర్థిస్తానని, అయితే కఠినమైన భద్రతా ప్రమాణాలు అమలు చేస్తూనే లిక్కర్ పరిశ్రమకు నష్టం జరగని విధంగా, వందలాది మంది ఉద్యోగాలు కోల్పోకుండా ఉండేలా కోర్టు తన తీర్పులో కొన్ని సవరణలు చేస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.