'రోగి యూపీ' స్వాగతం, యోగి వెళ్లగొడతారు, లాలూ జోకర్: అమర్ సింగ్
ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ను 'రోగి ఉత్తర ప్రదేశ్' ఆశీర్వదిస్తోందని, రాష్ట్రంలోని అవినీతిని, బంధుప్రీతిని సీఎం యోగి వెళ్లగొడతారని అమర్ సింగ్ ఆదివారం ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ను 'రోగి ఉత్తర ప్రదేశ్' ఆశీర్వదిస్తోందని, స్వాగతిస్తోందని, రాష్ట్రంలోని అవినీతిని, బంధుప్రీతిని సీఎం యోగి వెళ్లగొడతారని తాను విశ్వసిస్తున్నట్లు సమాజ్ వాది పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ ఆదివారం ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీపై అమర్ ప్రశంసలు
అమర్ సింగ్ బీజేపీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఆయన అభినందనలు తెలిపారు. ఇతర వర్గాల పట్ల యోగి విరుద్ధంగా ఉంటారని కొంతమంది తప్పుగా అంచనా వేస్తున్నారని, కానీ ఆయన నిరాడంబరుడు, యువతకు నాయకుడు అన్నారు.
ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు మంచిదే
రోగి ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని ఆశీర్వదిస్తుందని అమర్ సింగ్ అన్నారు. పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్కు ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమిస్తున్న బీజేపీ తీసుకున్న నిర్ణయం సరైనదే అన్నారు.
ఇక బీజేపీ అడ్డుకట్ట వేస్తుంది
పెద్ద రాష్ట్రమైన యూపీని చూసుకోవాలంటే చాలా కష్టమని, ఉపముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ నియమించడం మంచి నిర్ణయమని అమర్ సింగ్ అన్నారు. వారిద్దరూ తమ నిజాయతీతో కీర్తి గడించారని ప్రశంసించారు. ఇక ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న దౌర్జనం, అక్రమాలకు కొత్త ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందన్నారు. అవినీతిపరులను బీజేపీ శిక్షిస్తుందన్నారు.
అఖిలేష్, మాయావతి గెలిస్తే
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినట్లు ఎస్పీ, బీఎస్పీ చేస్తున్న ఆరోపణలను అమర్ సింగ్ ఖండించారు. ఒకవేళ ఎన్నికల్లో అఖిలేశ్యాదవ్, మాయావతి గెలిచినట్లయితే ఈవీఎంపై ఇటువంటి ఆరోపణలు వచ్చేవి కావన్నారు.
దేశంలోనే లాలూ ఓ జోకర్
బీజేపీ విజయంపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మాటలను అమర్ సింగ్ తోసిపుచ్చారు. భారత రాజకీయాల్లోనే లాలూ ఒక జోకర్ అన్నారు. ఆయన పనికిరాని వ్యాఖ్యలు ఆయనకు అపఖ్యాతిని తెచ్చిపెట్టాయన్నారు.