ఇప్పుడు రోహింగ్యా ముస్లింల వంతు.. వారిని తమ దేశానికి పంపిస్తాం: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
ఎవరు ఎంత వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ... పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తున్నామని చెప్పారు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన రోజునే జమ్ము కశ్మీర్లో అమలు చేశామని గుర్తుచేశారు. కొత్త పౌరసత్వ సవరణ చట్టం ఆధారంగా దేశంలో అక్రమంగా స్థిరపడ్డ రోహింగ్యా శరణార్థులను వారిదేశాలకు పంపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని చెప్పారు. కొత్త చట్ట ప్రకారం రోహింగ్యాలకు భారత పౌరసత్వం లభించదని చెప్పారు.
రోహింగ్యాలు భారత్లోకి ఎలా వచ్చి ఎలా స్థిరపడ్డారో విచారణ చేయాలని డిమాండ్ చేశారు జితేంద్ర సింగ్. బెంగాల్ నుంచి జమ్మూ కశ్మీర్ వరకు రోహింగ్యాలు ఆయా ప్రాంతాల్లో స్థిరపడ్డారని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. సాధారణ నిధులకు సబంధించిన నిబంధనల గురించి జమ్మూ కశ్మీర్లో మాట్లాడిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో రోహింగ్యాల సంఖ్య ఎక్కువగానే ఉందని మంత్రి తెలిపారు. అయితే వారిని తిరిగి తమ దేశాలకు ఎలా పంపాలో అనేదానిపై కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు జితేంద్ర సింగ్.
రోహింగ్యాలకు సంబంధించిన జాబితాను ఒకటి తయారు చేసి , వారికి బయోమెట్రిక్ ఐడెంటిటీ కార్డులను అందజేస్తామన్నారు. ఎందుకంటే రోహింగ్యాలకు సంబంధించి పౌరసత్వ సవరణ చట్టంలో ఎలాంటి ప్రస్తావన చేయలేదని స్పష్టం చేశారు. చట్టంలో పేర్కొన్నట్లుగా వారు ఆ ఆరు మైనార్టీ మతాలకు చెందిన వారు కాదని చెప్పారు. అంతేకాదు వారు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ దేశాలకు చెందిన వారు కాదని చెప్పారు. మయన్మార్ నుంచి రోహింగ్యాలు భారత్కు వచ్చారని మంత్రి గుర్తుచేశారు. కాబట్టి రోహింగ్యాలు తిరిగి మయన్మార్కు వెళ్లిపోవాల్సిందే అని అన్నారు.
జమ్మూ కశ్మీర్లో 13,700 మంది విదేశీయులు స్థిరపడ్డట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశీయులు అధికంగా సాంబా జిల్లాలో స్థిరపడ్డారు. 2008 నుంచి 2016వరకు వారి జనాభా 6వేలకు పైగా ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే రోహింగ్యాలను దేశం నుంచి పంపివేయాలని గతంలో బీజేపీ, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్లతో పాటు ఇతర సామాజిక సంస్థలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.