జాతి భద్రతకే పెను ముప్పు: రోహింగ్యాలపై సుప్రీంకు కేంద్రం
రోహింగ్యాలు జాతీయ భద్రతకు పెను ముప్పు అని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వారిని ఇస్లామిక్ స్టేట్ లాంటి ఉగ్రవాద గ్రూపులు ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలిపింది.
న్యూఢిల్లీ: రోహింగ్యాలు జాతీయ భద్రతకు పెను ముప్పు అని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వారిని ఇస్లామిక్ స్టేట్ లాంటి ఉగ్రవాద గ్రూపులు ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలిపింది. జాతి సమగ్రత దృష్ట్యా రోహింగ్యాలను దేశం నుంచి పంపించే ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోవద్దని ఈ సందర్భంగా విన్నవించింది.
అంతేగాక, కొందరు రోహింగ్యాలకు ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని నిఘా సంస్థలు కూడా హెచ్చరించాయని కోర్టు తెలిపింది. ఈ గ్రూపులు జమ్మూ, ఢిల్లీ, మేవాత్, హైదరాబాద్ లాంటి తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని చెప్పింది. కాగా, విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.
రోహింగ్యాలను దేశం నుంచి పంపవద్దని ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైన నేపథ్యంలో కేంద్రం కోర్టుకు తన అభ్యంతరాన్ని తెలిపింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్ట్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని వివరణ కోరగా కేంద్రం ఈ మేరకు స్పందించింది. దీంతో సెప్టెంబర్ 18న కోర్టు వాదనలు విననుంది.
కాగా, పిటిషనర్ మాత్రం రోహింగ్యాలకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని వాదించారు. మొహమ్మద్ యూనస్ అనే రోహింగ్యా ద్వారా ఈ పిటిషన్ కోర్టులో దాఖలు చేయబడింది. రోహింగ్యాలు పోలీసుల విచారణకు వస్తే వారితో ఎప్పుడూ సహకరిస్తున్నారని చెప్పారు. మయన్మార్ నుంచి వలసవచ్చిన తమకు రక్షణ కావాలని కోరారు.
సుమారు 7వేల మంది రోహింగ్యాలు భారతదేశంలో నివసిస్తున్నారని చెప్పారు. హిందువులకు చెందిన భూములు, ఇళ్లలోనే వారు నివాసం ఉంటున్నారని తెలిపారు. యజమానులకు సకాలంలో అద్దె చెల్లించి ఎలాంటి గొడవలు లేకుండా వారితో జీవనం చేస్తున్నారని పిటిషనర్ వివరించారు.