ఇష్టంలేని పెళ్లి, ఆస్తిపై కన్ను .. ఇంతలో టచ్లోకి బాయ్ఫ్రెండ్ : రోహిత్ హత్యకు కారణాలివే ?
న్యూఢిల్లీ : యూపీ మాజీ సీఎం ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ మర్డర్ డైలీ సీరియల్ను తలపిస్తోంది. హత్య కేసు విచారిస్తోన్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. రోహిత్ను ఇష్టంలేని పెళ్లి చేసుకున్న అపూర్వ విడిపోయేందుకు సిద్ధమైంది. దీనికితోడు వరకట్న వేధింపుల కేసు పెట్టడం, ఇంతలో అపూర్వ బాయ్ ఫ్రెండ్ తెరపైకి రావడంతో రోహిత్ మర్డర్ కేసులో అపూర్వ కీ రోల్ పోషించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రోహిత్ హత్యకు సంబంధించి ఇప్పటికే అపూర్వ, సిద్దార్థ్, తివారీ పనివాడు, డ్రైవర్ ను పోలీసులు విచారించారు.
ఆ ప్రాంగణంలోనే ..?
రోహిత్ హత్య చేసిన వ్యక్తి డిఫెన్స్ కాలనీలో నివసిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కాలనీలోకి కొత్తగా ఎవరు రాలేదని అక్కడున్న సెక్యూరిటీ వివరాల ఆధారంగా తెలుసుకున్నారు. దీనికితోడు అక్కడున్న ఏడు కెమెరాల్లో రెండు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ ఇళ్లు రోహిణిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ బృందం పరిశీలించారు. హత్య జరిగిన పరిణామాలను సీన్ రీ కన్ స్ట్రక్ట్ చేశారు.
ఇంటికి తిరిగొచ్చి .. తిరిగిరాని లోకాలకు ...
ఉత్తరాఖండలో ఓటేసేందుకు వెళ్లిన రోహిత్ .. ఈ నెల 15న ఢిల్లీ తిరిగొచ్చారు. అయితే ఆ రోజు రాత్రి రోహిత్ గోడను పట్టుకొన నడుస్తూ సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడు. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఆ రోజు తల్లితో కలిసి వెళ్లి తిరిగొచ్చిన రోహిత్ ... ఆలసటగా ఉన్నానని పడుకొన్నాడని ఆమె భార్య అపూర్వ అత్తమ్మకు తెలిపింది. ఆ తర్వాతే రోహిత్ చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో అపూర్వనే పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఆమె గోర్లు, వెంట్రుకల శాంపిల్స్ కూడా ఎయిమ్స్ వైద్యులు సేకరించారు. రోహిత్ ఊపిరాడక చనిపోవడంతో అపూర్వ ఎవరికైనా సాయం చేసిందా ? అలా చేసినా పక్షంలో ఆమె వెంట్రుకలు, గోర్లకు సంబంధించి ముద్రలను కనుగొనవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
లేని సఖ్యత ...
అపూర్వకు రోహిత్తో గతేడాది పెళ్లి జరిగింది. అయితే వీరి మధ్య సఖ్యత లేదని వారి కుటుంబసభ్యులు కూడా చెప్తుంటారు. వీరిద్దరూ మ్యాట్రిమెనల్ సైట్ ద్వారా కలుసుకొన్నారు. అలా ఏడాదిపాటు సహజీవన చేశాకే 2018 మే 12 పెళ్లి చేసుకున్నారు. అయితే గత నెల నుంచి వారి మధ్య విభేదాలు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. దీంతోనే అపూర్వ తన తల్లిదండ్రులతోపాటు ఉంటోంది. అంతేకాదు తాము విడిపోయేందుకు కూడా చర్చించుకున్నారని .. ఈ జూన్ లో విడాకులు కూడా తీసుకుంటామని మాట్లాడినట్టు తెలుస్తోంది.
ఆస్తిపై కన్ను ..
ఈ క్రమంలోనే అపూర్వ, ఆమె కుటుంబం .. రోహిత్ ఆస్తిపై కన్నుపడిందని ఊజ్వల ఆరోపించడంతో హత్యకు సంబంధించి బలం చేకూరుతోంది. రోహిత్, సిద్దార్థ ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు అపూర్వ ప్రయత్నించిందని ఊజ్వల ఆరోపించారు. అపూర్వ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తోందని .. ఆమెకు ప్రస్తుతం ఉంటోన్న ఇల్లు దగ్గర అవుతోందని వివరించారు ఊజ్వల. అంతేకాదు రోహిత్ తో పెళ్లి కాక ముందే అపూర్వకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని .. పెళ్లైన ఆమెను కలుస్తున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రోహిత్, అపూర్వ ఒకే ఇంట్లో విడి విడిగా ఉంటున్నట్టు సమాచారం.