బయటపడ్డ మరో స్కామ్: బ్యాంకుల నుంచి రూ.800కోట్లు స్వాహా!, దేశం నుంచి 'జంప్'
న్యూఢిల్లీ: దేశం దాటిపోయాకే.. బ్యాంకులను నిండా ముంచినవాళ్ల పేర్లు వెలుగులోకి వస్తుండటం ఓ విచిత్రమైన వైచిత్రి. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కు దాదాపు రూ.11వేల కుచ్చుటోపీ పెట్టిన ఉదంతం, విజయ్ మాల్యా ఉదంతం అలాగే వెలుగుచూశాయి. ఇప్పుడు మరో ఉదంతం కూడా అలాగే వెలుగుచూడటం గమనార్హం.
పిఎన్బి స్కామ్: ఎవరీ నీరవ్ మోడీ, ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసిడర్?
ఏంటీ స్కామ్:
రొటోమాక్ అనే పెన్నుల తయారీ సంస్థ అధినేత విక్రమ్ కొఠారీ కాన్పూర్లోని ప్రభుత్వ రంగ బ్యాంకులను నిండా ముంచి విదేశాలకు చెక్కేశాడు. దాదాపు రూ.800 కోట్ల మేర రుణాలను పొందిన ఆయన.. ఇప్పటిదాకా దానికి వడ్డీ గానీ, అసలు గానీ చెల్లించలేదు.
ఏయే బ్యాంకులు:
నీరవ్ మోడీ కేసులో లాగే.. విక్రమ్ కొఠారీ కేసులోనూ బ్యాంకుల లొసుగులు బయటపడుతున్నాయి. షూరిటీ లేకుండా.. కనీస నిబంధనలను పాటించకుండా అడ్డగోలుగా విక్రమ్ కొఠారీకి రుణాలను మంజూరు చేశాయి బ్యాంకులు.
కొఠారీకి రుణం మంజూరు చేసిన బ్యాంకుల్లో.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలు ఉన్నాయి.
Recommended Video
రూ.800 కోట్ల స్కామ్..:
ముంబైలోని యూనియన్ బ్యాంకు నుంచి రూ.485 కోట్లు, కోల్కతాలోని అలహాబాద్ బ్యాంకు నుంచి రూ.352 కోట్లను కొఠారీ రుణంగా పొందారు. తీసుకుని ఏడాది గడిచినా.. వడ్డీకి, అసలుకు గతి లేదు.
పైగా తనను 'ఉద్దేశపూర్వక ఎగవేతదారు' జాబితాలో చేర్చినందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. వడ్డీ చెల్లించని కారణంగానే అలా చేయాల్సి వచ్చిందని కోర్టు చెప్పగా.. తాను రూ.300కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకుకి ఇచ్చేందుకు ముందుకొచ్చానని కొఠారీ చెప్పడంతో తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది.
దేశం నుంచి 'జంప్':
గత వారం రోజులుగా కొఠారీ ఎవరికీ కనిపించకుండా పోవడంతో.. ఇక ఆయన కూడా విదేశాలకు చెక్కేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కాన్పూర్ సిటీ సెంటర్ రోడ్డులోని ఆయన ఆఫీస్ కూడా వారం రోజులుగా మూత పడి ఉండటం గమనార్హం.
మరోవైపు కొఠారీ మాత్రం తానెక్కడికి పారిపోలేదని స్థానిక మీడియాతో చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన అలహాబాద్ బ్యాంక్ ఉన్నతాధికారులు.. ఆస్తులు జప్తు చేసైనా కొఠారీకి ఇచ్చిన రుణాలను వసూలు చేస్తామని చెబుతున్నారు.