కరోనా వ్యాక్సిన్ రవాణాలో వారియర్ గా తపాలా శాఖ: మొదలైన రూట్ మ్యాపింగ్
భారత తపాలా శాఖ ... నిన్నా మొన్నటి దాకా చాలా మంది ప్రాధాన్యత ఉన్న వ్యవస్థగా చూడని తపాలా శాఖ ఇప్పుడు దేశానికి ప్రాధాన్యతాంశంగా మారింది. ఎందుకంటె కరోనా వ్యాక్సిన్ పంపిణీ చెయ్యటానికి తపాలా శాఖనే వారియర్ గా పని చెయ్యనుంది . అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం..
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రూట్ మ్యాపింగ్
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ చివరిదశలో ఉన్న నేపథ్యంలో వచ్చే మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇండియాలో ఫిబ్రవరి, మార్చి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పంపిణీ విషయంలో రూట్ మ్యాపింగ్ ప్రక్రియ మొదలైనట్లుగా తెలుస్తుంది.
తపాలా శాఖ సేవలు వినియోగించుకోనున్న ప్రభుత్వం
పంపిణీ ప్రక్రియ పై దృష్టి సారించిన ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దాన్ని దేశంలోని నలుమూలలకూ పంపిణీ చేయాలని భావిస్తోంది. అందుకోసం తపాలశాఖ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ రవాణా, కోల్డ్ చైన్ ఏర్పాటు వంటి మొత్తం పనులను తపాల శాఖకు అప్పగించింది. కరోనా వ్యాక్సిన్ కోసం దేశమంతా ఎదురు చూస్తున్న వేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పంపిణీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. అందుకే ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి, ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి ప్రణాళిక రూపొందిస్తున్నారు.
తపాలా శాఖ వద్ద దేశంలో నలుమూలలకు చేరవేయటానికి సరిపోయే వాహనాలు
అందులో భాగంగానే తపాలా శాఖకు బృహత్తరమైన బాధ్యతలను అప్పగించనున్నారు. కరోనా వ్యాక్సిన్ దేశంలోని నలుమూలలకు చేరవేయడానికి కావలసినంత వాహనాలు తపాల శాఖకు ఉన్నాయని మారుమూల గ్రామాలకు కూడా పోస్టల్ నెట్వర్కింగ్ ఉండటంతో పంపిణీ సులభంగా అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తపాల శాఖ ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని అప్పజెప్పడం వెనుక మరో కారణం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది.
Recommended Video
టీబీ వ్యాక్సిన్ ను తపాలశాఖ పంపిణీ చేసిన అనుభవం .. అందుకే కరోనా వ్యాక్సిన్ కూడా ..
గతంలో టీబీ వ్యాక్సిన్ ను తపాలశాఖ పంపిణీ చేసిన అనుభవం ఉండటంతో, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసే బాధ్యతను కూడా తపాల శాఖకు అప్పగించింది. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దేశంలోని ప్రతి మూలకు వెళ్లడానికి పోస్టల్ నెట్ వర్క్ ను వినియోగించుకోనున్న నేపథ్యంలో పంపిణీలో విశేష అనుభవం ఉన్న తపాలశాఖ యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించడానికి రెడీ అయింది. శీతలీకరణ పనులు కూడా చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఏది ఏమైనా పోస్టల్ శాఖ ఇటీవల పెరిగిపోయిన కొరియర్ సర్వీసులతో కాస్త దెబ్బ తిన్నట్టు కనిపించినా , ప్రభుత్వ కార్యాకలాపాల విషయంలో వారియర్ గా పని చేస్తుందని మరోమారు తాజా నిర్ణయంతో నిరూపించింది .