గవర్నర్కు ఉద్ధవ్ సర్కార్ షాక్- విమాన ప్రయాణానికి నో- రెండు గంటల వెయిటింగ్
మహారాష్ట్రలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ వర్సెస్ ఉద్ధవ్ ధాక్రే సర్కారు మధ్య పోరు మరింత ముదిరింది. ఇప్పటికే పలు అంశాల్లో ప్రభుత్వంతో విభేధిస్తున్న గవర్నర్ కోష్యారీకి ఉద్ధవ్ ప్రభుత్వం ఇవాళ భారీ షాక్ ఇచ్చింది. ఉత్తరాఖండ్లో జల ప్రళయం బాధితుల పరామర్శకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయనకు ప్రభుత్వ విమానం ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన రెండు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో ప్రైవేటు విమానంలో ఆయన బయలుదేరి వెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
గవర్నర్ కోష్యారీకి విమానం నిరాకరణ
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ధాక్రేకి మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ఇవాళ మరో మలుపు తీసుకుంది.
గవర్నర్ కోష్యారీతో ఇప్పటికే పలు అంశాల్లో విభేదిస్తున్న మహావికాస్ అఘాడీ సర్కారు ఇవాళ ఆయనకు అనుకోని షాకిచ్చింది. ఉత్తరాఖండ్ పర్యటనకు బయలుదేరాలని నిర్ణయించుకున్న గవర్నర్ ఉదయం 9 గంటలకే విమానాశ్రయానికి వచ్చారు. విమానం ఎక్కి కూర్చున్నారు కూడా. కానీ విమానం మాత్రం ఎంతకీ కదలలేదు. దీంతో పైలట్ను సంప్రదించగా.. విమానం టేకాఫ్కు అనుమతి లేదని తేల్చిచెప్పేశారు. దీంతో గవర్నర్ షాక్కు గురయ్యారు.
రెండు గంటల పాటు ఎదురుచూపులు
అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ బయలుదేరేందుకు విమానాశ్రయానికి వచ్చిన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి అధికారులు ఎలాంటి ఆటంకాలు కల్పించలేదు. దీంతో ఆయన నేరుగా విమానం ఎక్కి కూర్చున్నారు. రెండు గంటల సేపు ఎదురుచూసినా విమానం మాత్రం కదలడం లేదు. సాంకేతిక కారణాలు, అనుమతులు వంటి సమస్యలు ఉన్నాయేమో అని ఆయన కూడా వారిని ఏమీ అనలేదు. కానీ రెండు గంటల తర్వాత చూసుకుంటే విమానం బయలుదేరకపోవడానికి ప్రభుత్వం అనుమతి లేకపోవడమే కారణమని తేలింది. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. వారం రోజుల క్రితమే అనుమతి కోరినా ప్రభుత్వం నిరాకరించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీవీఐపీలకే విమానం అన్న ప్రభుత్వం
గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తాను ఎక్కిన ప్రభుత్వ విమానం టేకాఫ్కు అనుమతి లేదని తెలిసిన తర్వాత తన అధికారుల సాయంతో ప్రభుత్వాన్ని సంప్రదించడం మొదలుపెట్టారు. గవర్నర్ ప్రశ్నకు అధికారుల సమాధానం ఆయన్ను మరింత చిర్రెక్కేలా చేసింది. ప్రభుత్వ విమానం కేవలం వీవీఐపీలకు మాత్రమేనని, సీఎం, డిప్యూటీ సీఎంలకు మాత్రమే ఇందులో ప్రయాణించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందని ఆయనకు అధికారులు చెప్పేశారు. దీంతో ఆయనకు కాసేపు ఏం చేయాలో తెలియలేదు. అనంతరం మరో ప్రైవేటు విమానం టికెట్ బుక్ చేసుకుని మరీ ఉత్తరాఖండ్ వెళ్లారు.
గవర్నర్కు విమాన నిరాకరణపై మాటలయుద్ధం
గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి విమానం నిరాకరించడంపై మహారాష్ట్రలో బీజేపీ మండిపడింది. ఉద్ధవ్ థాక్రే సర్కారు ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ను అవమానించిందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వంలోని కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతలు నిబంధనల ప్రకారమే సర్కారు వ్యవహరించిందని చెప్తున్నారు. వీవీఐపీలకు మాత్రమే అనుమతి ఉన్న విమానంలో గవర్నర్ ప్రయాణానికి సిద్ధం కావడమే తప్పు అన్నట్లుగా ప్రభుత్వంలోని సంకీర్ణ పక్షాల నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.