నేపాల్లో కలకలం: రా చీఫ్-ప్రధాని కేపీ శర్మ ఓలి భేటీ, వచ్చే నెలలో ఆర్మీ చీఫ్ పర్యటన
న్యూఢిల్లీ: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలితో భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) అధిపతి సమంత్ కుమార్ గోయెల్ భేటీ కావడం ఇప్పుడు ఆ దేశంలో దుమారం రేపుతోంది. ముగ్గురు మాజీ ప్రధానులతోపాటు సొంత పార్టీ నేతలు కూడా ఈ భేటీ ఆంతర్యేమంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అనేక విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటున్న ఓలీ.. ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడినట్లయింది.
ఇద్దరు ప్రొఫెసర్లపై ఎన్ఐఏ సంచలన చార్జిషీట్.. నేపాల్ మావో అగ్ర నేతతో టచ్..
రా చీఫ్-ఓలి భేటీ అభ్యంతరకరమంటూ ప్రచండ
కేపీ శర్మ ఓలి భారత రా చీఫ్తో భేటీ కావడం సరికాదని, అంతేగాక అభ్యంతరకరమని మాజీ ప్రధాని, రూలింగ్ నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ, మాజీ ప్రధానులు ఝలనాథ్ ఖనల్, మాధవ్ కుమార్ నేపాల్ వ్యాఖ్యానించారు. మాజీ ఉపప్రధానులుభీమ్ బహదూర్ రావల్, నారాయణ ఖాజీ శ్రేష్ట సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. బుధవారం అర్ధరాత్రి వరకు రెండుగంటలపాటు రా చీఫ్తో జరిగిన భేటీ గురించి వివరించాలని డిమాండ్ చేశారు.
ప్రధానితోపాటు రా చీఫ్ వరుస భేటీలు
కాగా, గోయల్, ఆయన బృందం ప్రత్యేక విమానంలో ఖాట్మాండ్ బయల్దేరి వెళ్లారు. నేపాల్ ప్రధానితోపాటు ప్రతిపక్ష నేత షేర్ బహదూర్ దౌబా, మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయి, మాదేశ్ నేత మహంత ఠాకూర్లను కూడా వీరు తమ పర్యటనలో వేర్వేరుగా కలిశారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి పత్రికా సలహాదారు సూర్య థాపా స్పందిస్తూ.. గోయెల్- ఓలితో జరిగినది "మర్యాదపూర్వక సమావేశం" మాత్రమేనని అన్నారు. గోయెల్ నేపాల్-ఇండియా సంబంధాలను సున్నితంగా నొక్కిచెప్పారని, సంభాషణల ద్వారా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారని, పరస్పర సహకారం కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఓలి ప్రవర్తన సరిగా లేకపోయినప్పటికీ పార్టీని బలపర్చడం తన కర్తవ్యమని ప్రచండ వ్యాఖ్యానించారు. ఇలాంటి కీలక సమావేశాల గురించి పార్టీలోని కీలక నేతలకు, మంత్రివర్గానికి తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Recommended Video
వచ్చే నెలలో నేపాల్కు భారత ఆర్మీ చీఫ్..
వచ్చే నెలలో భారత ఆర్మీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరావణే పర్యటన ఉన్న నేపథ్యంలో రా చీఫ్ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంత కాలంగా కొనసాగిన వివాదాల నేపథ్యంలో నేపాల్-భారత్ సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నాయి. దీంతో తిరిగి ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. చైనాకు సరిహద్దుగా ఉన్న ఈ దేశం భారత్కు ఎంతో కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే, నేపాల్కు భారత సాయం కూడా అంతే అవసరం.