రేపు బెంగాల్లో బీజేపీ, తృణమూల్ హోరాహోరీ- ఒకే చోట ఒకే సమయంలో ర్యాలీలు
పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో రాజకీయాలు కూడా అంతే స్ధాయిలో వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్ధితుల్లో రేపటి నుంచి రెండురోజుల పాటు ఇరుపార్టీలు నాదియా జిల్లాలో బలప్రదర్శనకు దిగుతున్నాయి.
రేపు, ఎల్లుండి నాదియా జిల్లాలో బీజేపీ పరివర్తన్ రథయాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ యాత్రను ప్రారంభించబోతున్నారు. అయితే దీనికి కౌంటర్గా అదే సమయంలో అదే జిల్లాలో జనసమర్ధన్ యాత్ర పేరుతో వేలాది బైక్లతో ర్యాలీ నిర్వహిస్తామని తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం ప్రకటించింది. దీంతో ఈ రెండు ర్యాలీలతో నాదియా జిల్లాలో రాజకీయాలు హోరెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎన్నికల వేళ రాజకీయాలు ఎందుకని అనుకున్నారో ఏమో సీఎం మమత బీజేపీ రథయాత్రకు కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ నేతలు ఈ రథయాత్రతో బల ప్రదర్శన చేయాలని సిద్ధమవుతున్నారు. దీనికి గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేతలు రంగంలోకి దిగుతున్నారు. అయితే బీజేపీకి ప్రభుత్వం నేరుగా అనుమతి ఇచ్చిందా లేదా అన్నది స్పష్టం కావడం లేదు. బీజేపీ నేతలు తమకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్తుండగా.. ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదు. ఎందుకైనా మంచిదని ర్యారీ నిర్వహణకు అనుమతి కోరుతూ బీజేపీ నేతలు హైకోర్టును కూడా ఆశ్రయించారు.