రైల్వే పోలీసును రాళ్లతో కొట్టి చంపిన వ్యాపారులు: మరో ఇద్దరికి గాయాలు
మాల్దా: పశ్చిమబెంగాల్ జిల్లాలోని మాల్దా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైలు ప్రవేశ ద్వారం వద్ద ఎలాంటి పదార్థాలు అమ్మకూడదని అడ్డుకున్న ఎస్ సమంత అనే ఆర్పీఎఫ్ పోలీసు అధికారిని రాళ్లతో కొట్టి చంపారు వ్యాపారులు.
పోలీసుల వివరాల ప్రకారం.. మాల్దా రైల్వే స్టేషన్ ముఖ ద్వారం వద్ద ఓ వ్యక్తి ఏవో పదార్థాలు అమ్ముతున్నాడు. అదే సమయంలో అతడి వద్దకు వెళ్లిన ఆర్పీఎఫ్ అధికారి వాటిని అమ్మకూడదని, వెళ్లిపోవాలని చెప్పాడు. అయితే అతడు అందుకు నిరాకరించాడు.
దీంతో అతడిపై పోలీసు చేయి చేసుకున్నాడు. కాగా, అక్కడే చుట్టుపక్కల పలు తినుబండారాలు అమ్ముతున్న వారంతా పోగై రాళ్లతో ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అనంతరం ఆ పోలీసును బయటకు లాగి పిడిగుద్దులు కురిపించి రాళ్లతో కొట్టారు.
తీవ్ర గాయాలపాలైన పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయాడు. అక్కడి చేరుకున్న మరో ఇద్దరు పోలీసులపై కూడా వ్యాపారులు దాడికి పాల్పడ్డారు. వారికి కూడా గాయాలయ్యాయి. దీంతో ఓ పోలీసు అధికారి గాల్లోకి 13 రౌండ్ల కాల్పులు జరిపాడు. అక్కడ్నుంచి ఆందోళనకారులు పరారయ్యారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ చేరుకున్న పోలీసులు, గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. అనుమతి లేనప్పటికీ వ్యాపారులు ప్లాట్ ఫాంలపై వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్పారు. నిందితులైన వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.