అక్కడ మాస్క్ ధరించకుంటే రూ .1000 జరిమానా .. ఆగస్ట్ 11 నుండి అమలు
కరోనా కట్టడి కోసం గుజరాత్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది . తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఫేస్ మాస్క్ ధరించని వారికి జరిమానాను 1000 రూపాయలకు పెంచింది ఆగస్టు 11 నుండి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సోమవారం ప్రకటించారు.
ఇప్పటికే కరోనా కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇదే సమయంలో ప్రజలలో కూడా అవగాహన కల్పించాలని ప్రయత్నం చేసిన ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పాటించని వారి కోసం కఠిన నిబంధనలు అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్ ప్రభుత్వం జరిమానాను గత నెలలో రూ .200 నుండి రూ.500 కు పెంచారు. ఇక ఇప్పుడు ఏకంగా వెయ్యి రూపాయలు చేసింది.
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మాస్కులు కూడా కేవలం 2 రూపాయల చొప్పున ప్రభుత్వం గతంలో అన్ని అముల్ మిల్క్ పార్లర్లలో సాధారణ ఫేస్ మాస్క్లను అందుబాటులోకి తెచ్చింది. కానీ చాలా మంది ఇంకా మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. దీంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది . గుజరాత్ లో ఇప్పటి వరకు 71,064 కేసులు నమోదు కాగా 14,174 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 54,238 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఆదివారం నాటికి గుజరాత్లో 1,078 కొత్త కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 24 గంటల్లో 25 కొత్త మరణాలతో మరణాల సంఖ్య 2,654 కు పెరిగింది. కరోనా పెరుగుతున్న జిల్లాలలో సూరత్లో అత్యధికంగా 222 కొత్త కేసులు నమోదయ్యాయి, అహ్మదాబాద్లో 153 కేసులు నమోదు అయ్యాయి. సూరత్ లో ఆదివారం తొమ్మిది మరణాలు సంభవించాయి.