ఆరోగ్యసేతు యాప్ లేకుంటే రూ. 1000 లేదా ఆరు నెలల జైలు: ఎక్కడో తెలుసా?
నోయిడా: కరోనా మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి.
కాగా, కొన్ని కార్యాలయాల్లో విధులకు హాజరుకావాలంటే ఈ యాప్ వినియోగాన్ని తప్పనిసరి చేశారు. గ్రేటర్ నోయిడా పరిధిలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న వినియోగదారులు ఆరోగ్యసేతు యాప్ లేకుండా బయట తిరగడం నేరమని స్పష్టం చేసింది. అంతేగాక, శిక్షార్హులు కూడా అవుతారని పోలీసులు ప్రకటించారు.
యాప్ డౌన్ లోడ్ చేసుకోని వారికి రూ. 1000 జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష తప్పదని పోలీసులు స్పష్టం చేశారు. అంతేగాక, మాస్కు లేకుండా రోడ్లపైకి రావడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం కూడా తీవ్ర నేరంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్షలు తప్పవని అదనపు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ ద్వివేది స్పష్టం చేశారు.
కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2880 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 987 మంది కరోనా నుంచి కోలుకోగా, 1837 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యూపీలో ఇప్పటి వరకు 56 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.