అరుణాచల్లో ఓటుకు నోటు! సీఎం కాన్వాయ్లో కోట్ల కట్టలు!
ఎన్నికల వేళ అరుణాచల్ సీఎం కాన్వాయ్లో నోట్ల కట్టలు కలకలంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. రెడ్ హ్యాండెడ్గా దొరికినా ఈసీ ఇంకా చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మోడీ సభకు హాజరయ్యే వారికి పంచేందుకు రూ.1.8కోట్లు తరలించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడుతోంది.
మాదాపూర్లో కోట్ల కట్టలు : రూ.2 కోట్లు స్వాధీనం, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గుర్తింపు?
కాంగ్రెస్ ఫిర్యాదుతో తనిఖీలు
సీఎం కాన్వాయ్లో భారీ మొత్తంలో నగదు తరలిస్తున్నారన్న సమాచారంతో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్నిఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఫిర్యాదుపై స్పందించిన అధికారులు తనిఖీలు నిర్వహించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సీఎం కాన్వాయ్లో 1.8కోట్ల నగదు
తనిఖీల్లో భాగంగా అధికారులు మంగళవారం అర్థరాత్రి సోదాలు నిర్వహించారు. వాటిలో భాగంగా అరుణాచల్ సీఎం పెమా ఖాండూ కాన్వాయ్లో తరలిస్తున్న రూ.1.8కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో కాన్వాయ్లో పెమాఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తాపిర్ గావ్ ఉన్నారు. సీజ్ చేసిన రూ.1.8కోట్ల నగదును పాసిఘాట్లోని సియాంగ్ గెస్ట్ హౌస్కు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్థారించారు.
కేసు నమోదుచేయాలని కాంగ్రెస్ డిమాండ్
సీఎం కాన్వాయ్లో కోట్లు బయటపడటంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఓటుకు నోటు కోసమే ఆ మొత్తాన్ని తరలించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. భారీ మొత్తంలో డబ్బు తరలిస్తూ దొరికిపోయినా ఎన్నికల సంఘంగానీ, ఈడీగానీ చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనతో చౌకీదార్లమని చెప్పుకుంటున్న వారు దొంగలన్న విషయం మరోసారి రుజువైందని కాంగ్రెస్ ఆరోపించింది.
దర్యాప్తు జరుగుతోందన్న అధికారులు
రూ.1.8కోట్ల సీజ్ చేయడంపై అరుణాచల్ ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కళింగ్ తయేంగ్ స్పందించారు. భారీ మొత్తంలో డబ్బు దొరికిన మాట వాస్తవమేనని, దానిపై దర్యాప్తు జరుపుతున్నామని ప్రకటించింది. డిప్యూటీ కమిషనర్, ఎస్పీ బిజీగా ఉన్నందున రిపోర్టు ఆలస్యమైందని, వారిచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని కళింగ్ స్పష్టం చేశారు.