నడి రోడ్డులో రూ. కోటి లూటీ: రూ.2,000 నోట్లు
ట్యాంకర్ లో తరలిస్తున్న కోటి రూపాయల నగదును నడి రోడ్డులో లూటీ చేసిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బెంగళూరు: ట్యాంకర్ లో తరలిస్తున్న కోటి రూపాయల నగదును నడి రోడ్డులో లూటీ చేసిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బెంగళూరుకు చెందిన ఆరోగ్యరాజు అనే వ్యాపారి నా డబ్బు లూటీ చేశారని పోలీసులను ఆశ్రయించాడు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆరోగ్యరాజు అనే వ్యాపారి ట్యాంకర్ వాహనంలో కోటి రూపాయల నగదు తరలించడానికి ప్రయత్నించారు. బెంగళూరు నగర శివార్లలోని తలఘట్టపుర సమీపంలో 15 మంది దుండగులు ట్యాంకర్ వాహనం అడ్డగించారు.
తరువాత వేటకోడవళ్లు, కత్తులతో ట్యాంకర్ లో ఉన్న వారిని బెదిరించి ప్రాణాలు తీస్తామని హెచ్చరించి ఆ వాహనంలో ఉన్న రూ. కోటి లూటీ చేసి పరారైనారు. లూటీ అయిన రూ. కోటిలో రూ.2,000, కొత్త రూ.500, రూ.100 నోట్లు ఉన్నాయని ఆరోగ్యరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆరోగ్యరాజు పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలా ? వద్దా ? అని రెండు రోజులు ఆలోచించి చివరికి ఫిర్యాదు చేశారని పోలీసులు అన్నారు. అయితే ఆరోగ్యరాజు ఇంత డబ్బు ఎందుకు దగ్గర పెట్టుకున్నారు ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆ డబ్బుకు ఆదాయ పన్ను చెల్లించారా ? కోటి రూపాయల నగదు ఎక్కడికి తరిస్తున్నారు ? అని ఆరా తీస్తున్నామని శుక్రవారం తలఘట్టపుర పోలీసులు తెలిపారు. ఆరోగ్యరాజు విచారించి వివరాలు సేకరించారు. ట్యాంకర్ డ్రైవర్ మీద అనుమానం రావడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.