కారణమిదే: అక్కడ ఒక్క రాత్రికి రూ. లక్ష
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం గోవాలో జరుపుకోవాలంటే జేబులు ఖాళీ కావాల్సిందే. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఏర్పాట్లలో గోవా హోటల్స్ భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు జీఎస్టీ కూడ కలుపుకొంటే తడిసి మోపెడు కానుంది.
కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు గోవా లాంటి టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్ళి ఆహ్లదకరంగా గడపాలని భావిస్తారు.అయితే ఈ ఏడాది మాత్రం గోవాలో హోటల్స్ గదుల్లో ఉండాలంటే లక్ష రూపాయాలు ఖర్చు చేయాల్సిందే. మామూలు రోజుల్లో మాత్రం తక్కువ ఛార్జీనే వసూలు చేస్తారు. కానీ, కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకొని డిమాండ్ పెరగడంతో ఎక్కువ మొత్తంలో ఛార్జీ చేస్తున్నారని సమాచారం.
గోవాలో ఒక్క రాత్రికి రూ. లక్ష ఛార్జీ
గోవాలో ఒక్క రాత్రి పూట హోటల్ గదిలో గడిపితే సుమారు లక్ష రూపాయాలను హోటల్స్ ఛార్జీ చేయనున్నాయి. డిసెంబర్ 31వ, తేదిన హోటల్ రూమ్ లో దిగితే లక్ష రూపాయాలను చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త పన్నుల విధానానికి తోడు జీఎస్టీ కారణంగా ధరలను పెంచాల్సి వచ్చిందని హోటల్ యజమానులు చెబుతున్నారు.గోవాలోని తాజ్ ఎక్సోటిక్ రిసార్టులో ఒక్క రోజు ఉండటానికి గది అద్దె రూ. 1,04,320కు పెరిగింది. ఇదే హోటల్లో జనవరి 31న, రూమ్ బుక్ చేస్తే రూ.20,700గా ఛార్జీ చేయనున్నట్టు తెలిసింది.
కొత్త సంవత్సరం కారణంగా రూమ్లకు డిమాండ్
కొత్త సంవత్సరం కారణంగా హోటల్ రూమ్లకు డిమాండ్ పెరిగిందంటున్నారు. గోవాలోని తాజ్ ఫోర్ట్ అగుడా రిసార్ట్లో ఒక్కరోజు స్టే చేయడానికి టారిఫ్ ఛార్జ్ రూ. 67వేలకు పెరిగింది. జీఎస్టీతో కలుపుకొని రూ.67 వేలు చెల్లిస్తే ఆ రోజు ఈ హోటల్లో అద్దెకు రూమ్ దొరుకుతోంది.
పర్యాటక ప్రాంతాల్లో హోటల్స్ బుక్
దేశంలోని పలు పర్యాటక ప్రదేశాల్లో హోటల్స్ రూమల్ కొత్త సంవత్సరానికి ఇప్పటికే బుక్ అయ్యాయి. కొత్త సంవత్సరం వేడుకలను పర్యాటక ప్రదేశాల్లో జరుపుకోవాలని కోరుకొనే వారికి హెటల్స్ ఛార్జీలతో ఇబ్బందులు తప్పేలా లేవు. అంతేకాదు హోటల్స్లో రూమ్లన్నీ ఎప్పుడో బుక్ అయ్యాయని హోటల్స్ యజమానులు చెబుతున్నారు.
టూరిస్టులకు వాతే
కొత్త సంవత్సరం వేడుకల్లో పర్యాటక ప్రాంతంలో గడపాలనే పర్యాటకుల జేబులు చిల్లులు పడాల్సిందే. అమాంతంగా పెరిగిన చార్జీలతో పర్యాటకులు కొన్ని చోట్ల హోటల్ గదుల కోసం సాధారణంగా చెల్లించే దాని కంటే నాలుగింతలు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బ్రేక్ ఫాస్ట్, భోజనం, డిన్నర్ లను కలుపుకొని కొన్ని హోటల్స్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.