ఎంఎఫ్ఈలకు రూ.10వేల కోట్లు,మత్స్య రంగానికి రూ.20 వేల కోట్లు : నిర్మలా సీతారామన్
భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్'కు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం(మే 15) మూడో ప్యాకేజీని ప్రకటించారు.
ఈ ప్యాకేజీలో మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెసెస్ను వ్యవస్థీకరించడానికి రూ.10వేల కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. లోకల్ వస్తువులను గ్లోబల్ మార్కెట్లో ప్రమోట్ చేయాలన్న ప్రధాని విజన్కు అనుగుణంగా ఇందులో స్కీమ్స్ ఉంటాయన్నారు. అసంఘటిత MFE(మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెసెస్) లకు FSSAI ఆహార ప్రమాణాలను సాధించడానికి, బ్రాండ్లను నిర్మించుకునేందుకు,మరియు మార్కెటింగ్కు అవసరమైన సాంకేతిక సహాయ సహకారాలను దీని ద్వారా అందిస్తామన్నారు.
MFEలను క్లస్టర్ ఆధారిత పద్దతిలో వ్యవస్థీకరించడం ద్వారా మెరుగైన ఆరోగ్య మరియు భద్రతా ప్రమాణాలు, రిటైల్ మార్కెట్లతో అనుసంధానం, మెరుగైన ఆదాయాలకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు.
మత్స్య రంగానికి కూడా ప్యాకేజీలో భారీ కేటాయింపులు చేశారు. రూ.20వేల కోట్ల భారీ నిధిని ప్రకటించారు. ప్రధానమంత్రి మత్స్స సంపద యోజన పథకం కింద ఈ నిధులను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇందులో రూ.11వేల కోట్లు ఆక్వాకల్చర్,సముద్ర,లోతట్టు మత్స్య సంపద సమగ్రాభివృద్దికి ఖర్చు చేస్తామన్నారు. అలాగే రూ.9వేల కోట్లు ఫిషింగ్ హార్బర్స్,కోల్డ్ చైన్స్ వంటి మౌలిక వసతుల నిర్మాణానికి ఖర్చుచేస్తామన్నారు.
ఈ పథకం ద్వారా రాబోయే ఐదేళ్లలో మరో 70లక్షల టన్నుల అదనపు చేపల ఉత్పత్తిని సాధిస్తామన్నారు. దాదాపు 55వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.