ఎకానమీ వార్.. రూ.10లక్షల కోట్లు నష్టం.. జీతాలకే డబ్బుల్లేవ్.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా భారత్ రూ.10లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోనున్నట్టు అంచనా వేస్తున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. కొన్ని రాష్ట్రాలకు ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవని పేర్కొన్నారు. బీజేపీ నిర్వహించిన జన్ సంవాద్ ర్యాలీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గడ్కరీ పాల్గొని ప్రసంగించారు.అటు ఎస్&పీ గ్లోబల్ రేటింగ్ సంస్థ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ది రేటు 5శాతం తగ్గిపోతుందని అంచనా వేసింది. అదే సమయంలో జీడీపీ వృద్ది రేటు 2021-22లో 8.5 శాతం, 2022-23లో 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేయడం గమనార్హం.
రూ.10లక్షల కోట్లు లోటు..
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. 'కరోనా సంక్షభం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. మనకు రూ.200లక్షల కోట్లు జీడీపీ ఉంది. ఇందులో 10శాతం.. అంటే,రూ.20లక్షల కోట్లు కేంద్రం పరిశ్రమలు,రైతులకు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఈ సంక్షోభం కారణంగా సుమారు రూ.10లక్షల కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడనుంది. మొత్తంగా రూ.30లక్షల కోట్లు ఇలాగే వెళ్లిపోతే... పరిస్థితులు ఇంకెక్కడికి దారితీస్తాయో..' అన్నారు.
సానుకూల దృక్పథంతో ఎదుర్కోవాలన్న గడ్కరీ
ఓవైపు ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయని చెబుతూనే.. వాటిని సానుకూలంగా డీల్ చేయవచ్చునని గడ్కరీ వ్యాఖ్యానించడం గమనార్హం. 'మనందరం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాం.ప్రస్తుతం ఒక సంక్షోభ కాలంలో ఉన్నాం. కాబట్టి దీన్ని నెగటివిటీతోనో,భయంతోనో,ఫ్రస్టేషన్తోనో ఎదుర్కోలేం. ఆత్మవిశ్వాసంతో,సానుకూల దృక్పథంతో మనం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి.' అని గడ్కరీ వ్యాఖ్యానించారు.
ఎకానమీ వార్..
'ఒక ఎకనమిక్ వార్ మొదలైంది. మన గ్రామాలు,రైతులు,కార్మికులు,పరిశ్రమలు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగులకు వచ్చే నెల జీతాలిచ్చేందుకు కూడా డబ్బులు లేవు.' అని గడ్కరీ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్కు త్వరలోనే వ్యాక్సిన్ అభివృద్ది చేయబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటివరకూ వైరస్తో పోరాడాల్సిందేనన్నారు.
Recommended Video
జాతీయవాదమే తమ ప్రాధాన్యత..
కాంగ్రెస్ గత 55 ఏళ్లలో చేయలేనిది బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో గత ఐదేళ్లలోనే చేసి చూపించిందన్నారు. జాతీయవాదం అనేది పార్టీ ప్రాధాన్యత అని,భావజాలం అని స్పష్టం చేశారు. మావోయిస్టులు,ఉగ్రవాదులను ఏరివేస్తామని మేనిఫెస్టోలోనే పొందుపరిచామని గుర్తుచేశారు. చెప్పినట్టుగానే వారిపై ఉక్కు పాదం మోపుతున్నామన్నారు. మోదీ నాయకత్వంలో జాతీయవాదం ద్వారా దేశ ప్రయోజనాలకు అన్నింటి కంటే ఎక్కువ ప్రియారిటీ కల్పిస్తున్నామన్నారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు,రామ మందిర నిర్మాణం.. ఇవన్నీ తమ భావజాలంలో భాగమేనన్నారు.