రూ.100 కోట్లా, ఊహించుకోలేం, ప్రభుత్వం మాదే, ఇదీ అసలు విషయం: కుమారస్వామికి జవదేకర్ కౌంటర్
Recommended Video
బెంగళూరు: బీజేపీ తమ పార్టీ ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేసిందన్న జేడీఎస్ అధినేత కుమార స్వామి వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. రూ.100 కోట్లు ఊహించుకోవడమే కష్టమని, ఈ ఆరోపణలతో కాంగ్రెస్ - జేడీఎస్ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.
జేడీఎస్ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేసిన బీజేపీ!
మేం అంతా నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మాకు మద్దతిచ్చే వారి జాబితాను గవర్నర్కు ఇప్పటికే సమర్పించామని వెల్లడించారు. మేం తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కుమారస్వామి తమపై చేస్తోన్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు.
అందులో కాంగ్రెస్ పార్టీయే దిట్ట
కుమారస్వామి, జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నామనే ఆరోపణలు సరికాదన్నారు. ఇలా చేయడంలో కాంగ్రెస్ పార్టీయే దిట్ట అన్నారు.
కుమారస్వామిని సీఎంగా చేయడం ఇష్టంలేక ఎమ్మెల్యేల అసంతృప్తి
అసలు కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ జేడీఎస్తో పొత్తు పెట్టుకొని, కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేయడం ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు. లింగాయత్ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. జేడీఎస్ - కాంగ్రెస్ పొత్తు ఇష్టం లేని వారు తమ వైపు వస్తున్నట్లుగా బీజేపీ చెబుతోంది.
అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వెంటే
కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ శాసన సభా పక్ష సమావేశానికి రాకపోవడంపై కర్ణాటక కాంగ్రెస్ నేత పరమేశ్వర స్పష్టత ఇచ్చారు. అందరు ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలకు ప్లైట్ ఆలస్యం కావడం వల్ల సమావేశానికి రాలేకపోయారని చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి పదవిపై
జేడీఎస్కు షరతులు లేని మద్దతు ఇచ్చామని, ఉప ముఖ్యమంత్రి పదవి అడగలేదని, ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ ప్రథమ లక్ష్యమని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు.
జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకం
జేడీఎస్ అధినేత కుమారస్వామికి మద్దతిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు సంతకం చేశారు. దీనిని గవర్నర్కు ఇవ్వనున్నారు.