షాకింగ్: వ్యాపారి కిడ్నాప్, విడిచిపెట్టేందుకు ఏకంగా రూ.100 కోట్లు అడిగారు
ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన దుండగులు.. అతన్ని విడిచిపెట్టడానికి ఏకంగా రూ.100 కోట్లు అడిగిన ఉదంతమిది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఫిరోజాబాద్ లో చోటు చేసుకుంది.
లక్నో: ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన దుండగులు.. అతన్ని విడిచిపెట్టడానికి ఏకంగా రూ.100 కోట్లు అడిగిన ఉదంతమిది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఫిరోజాబాద్ లో చోటు చేసుకుంది.
ఫిరోజాబాద్ కు చెందిన సంజీవ్ గుప్తా వ్యాపారవేత్త. ఫిరోజాబాద్ లోని ప్రముఖ చైన్ రెస్టారెంట్లు 'సాగర్ రత్న'లో గుప్తా భాగస్వామి. శనివారం ఆయన రెస్టారెంట్కి వెళ్లి, అక్కడి నుంచి తిరిగి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో సంజీవ్ కుటుంబీకులు రాత్రంతా అతడి కోసం గాలిస్తూనే ఉన్నారు.
ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో సంజీవ్ కుటుంబీకులకు వాట్సాప్లో ఓ మెసేజ్ వచ్చింది. సంజీవ్ని తాము కిడ్నాప్ చేశామని, రూ.100 కోట్లు ఇస్తేనే వదులుతామని ఆ మెసేజ్ లో హెచ్చరించారు. అంతేకాదు, ఈ విషయం పోలీసులకు చెబితే సంజీవ్ ను చంపేస్తామని కూడా అందులో హెచ్చరించారు. ఈ మెసేజ్ సంజీవ్ కుటుంబీకులు అందరికీ రావడం గమనార్హం.
అయితే అప్పటికే సంజీవ్ కుటుంబీకులు అతడి ఆచూకీ తెలపాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి సంజీవ్ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
ఈ నేపథ్యంలో పోలీసులకు సంజీవ్ కారు అలీఘడ్లోని టైర్లకు పంక్చర్లు వేసే ఓ దుకాణం ముందు లభ్యమైనట్లు సీనియర్ పోలీసు అధికారి అజయ్ పాండే తెలిపారు. సంజీవ్ మొబైల్ ఫోన్ న్యూఢిల్లీ, చండీగఢ్ లొకేషన్లలో కనిపించిందన్నారు.
బహుశా కిడ్నాపర్లు ఆయన్ని చండీగఢ్ తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే సంజీవ్ ఎక్కడున్నాడనేది కనుగొంటామని, కిడ్నాపర్ల చెర నుంచి అతడిని విడిపిస్తామని ఆయన పేర్కొన్నారు.