ఈ పెట్టుబడులతో భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మారుతుంది: నిర్మలా సీతారామన్
మోడీ ప్రభుత్వం గత ఆరేళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై 50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి నిర్మలా సీతారామన్... ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రభుత్వం 50 లక్షల కోట్లు వరకు పెట్టుబడులు పెట్టిందని చెప్పారు. విద్యుత్, రైల్వే, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, ఆరోగ్యం, డిజిటల్, అర్బన్ మొబిలిటీ, నీటి రంగాల్లో ఈ ఇన్వెస్ట్మెంట్లు జరిగాయని ఆమె వివరించారు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికోసం టాస్క్ఫోర్స్ను నియమిస్తామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ చెప్పారని గుర్తు చేసిన నిర్మలా సీతారామన్... అదే టాస్క్ ఫోర్స్ 102 లక్షల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను గుర్తించిందని చెప్పారు. కేవలం నాలుగు నెలల్లోనే 70 మంది వాటాదారులతో సంప్రదింపులు జరిపి ఈ ప్రాజెక్టులను గుర్తించిందని చెప్పారు. 21 మంత్రిత్వ శాఖల పరిధిలోకి ఈ ప్రాజెక్టులు వస్తాయని 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్టుబడులు పెడతామని చెప్పారు.
FM Nirmala Sitharaman: National Infrastructure Pipeline (NIP) Coordination Mechanism to be launched, comprising the Centre, states and private sector, for detailed planning, information dissemination and monitoring implementation of the NIP framework: pic.twitter.com/GSTMS0YNpG
— ANI (@ANI) December 31, 2019
ఇక భవిష్యత్తులో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై మాట్లాడిన నిర్మలా సీతారామన్... 2020లో ద్వితీయార్థంలో ప్రపంచ వార్షిక పెట్టుబడిదారుల సమావేశం భారత్లో నిర్వహిస్తామని చెప్పారు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ కోఆర్డినేషన్ మెకానిజంను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన సీతారామన్... ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ రంగాలకు చెందిన కంపెనీలు భాగస్వాములుగా ఉంటాయన్నారు.
లక్ష్యాలను అందుకునేందుకు డీటెయిల్డ్ ప్లాన్, సమాచారం, మరియు పర్యవేక్షణ అమలు చేయడంపై ఈ భాగస్వామ్యం దృష్టిసారిస్తుందని చెప్పారు నిర్మలా సీతారామన్. ఇక ఇది అమలైతే 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లను అందుకుంటుందని జోస్యం చెప్పారు.