ఉగ్రవాదులతో డీఎస్పీ ప్రయాణం: విచారణలో దిమ్మతిరిగే నిజాలు..రూ.12 లక్షలు డీల్
శ్రీనగర్: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనే సామెత ఉంది. కానీ శ్రీనగర్ పోలీసులు మాత్రం ఇంటి దొంగను చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం రోజున డీఎస్పీ హోదాలో పనిచేస్తున్న దవేందర్ సింగ్ ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులను ఓ కారులో తరలిస్తూ జమ్మూ - శ్రీనగర్ హైవేపై పట్టుబడ్డాడు. పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తుండగా దవేందర్ సింగ్ కొన్ని సమాధానాలు చెప్పారు. అయితే తన సమాధానంను సమర్థించుకునేలా ఎలాంటి రుజువులు లేవు. ఇంతకీ దవేందర్ సింగ్ చెప్పిన సమాధానం ఏమిటి..?
హిజ్బుల్ కమాండర్ను హతమార్చేందుకే...
ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను తరలిస్తూ పట్టుబడ్డ డీఎస్పీ దవేందర్ సింగ్ను దేశద్రోహిలా చూస్తామని ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఇక దవేందర్ సింగ్ను విచారణ చేస్తుండగా పలు ప్రశ్నలు విచారణాధికారులు సంధించారు. హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే ఆ ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి ప్రయాణం చేసినట్లు చెప్పాడు. కానీ దవేందర్ సింగ్ తన వాదనను సమర్థించుకునేందుకు ఎలాంటి రుజువులు పొందుపర్చలేదు. ప్రస్తుతం హైజాక్ నిరోధక శాఖ అదుపులో దవేందర్ సింగ్ ఉన్నాడు. అయితే ఇక్కడ పనిచేసే వారు అండర్ కవర్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ను నిర్వహించరు.
అలాంటి టాస్క్ ఇవ్వలేదన్న కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ వింగ్
దవేందర్ సింగ్ చెప్పిన సమాధానం పై జమ్మూ కశ్మీర్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ వింగ్తో టచ్లోకి వచ్చారు విచారణాధికారులు. అలాంటి సమాచారం తమ వద్ద ఏమీ లేదని వారు స్పష్టం చేశారు. పోనీ అలాంటి టాస్క్ ఏమైనా దవేందర్ సింగ్కు అప్పగించారా అని విచారణాధికారులు జమ్మూ కశ్మీర్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ వింగ్ అధికారులను అడుగగా అలాంటిదేమీ ఇవ్వలేదని చెప్పారు. శనివారం రోజున అరెస్టు అయిన హిజ్బుల్ ముజాహిద్దీన్ సభ్యులు నవీద్ మరియు అల్తాఫ్లు రెండు రోజుల పాటు శ్రీనగర్లోని ఇంద్రానగర్లో ఉన్న దవేందర్ సింగ్ ఇంట్లోనే ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
ఉగ్రవాదులను తరలించేందుకు రూ. 12 లక్షల డీల్
ఇక శ్రీనగర్లోని చెక్పోస్టు వద్ద తన కారును అధికారులు ఆపిన సమయంలో తను డీఎస్పీ అని చెప్పి కుటుంబ సభ్యులతో కలిసి జమ్మూకు వెళుతున్నట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే సింగ్ మాత్రం ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి ప్రయాణిస్తున్నారన్న పక్కా సమాచారం పోలీసులకు అప్పటికే చేరడంతో ఆయన పప్పులు ఉడకలేదని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే దవేందర్ సింగ్ నివాసంలో సోదాలు నిర్వహించగా ఒక ఏకే -47 తుపాకి, రెండు పిస్తోల్లు, రెండు గ్రెనేడ్లు, కొన్ని లక్షల రూపాయల నగదు దొరికినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం దగ్గర నుంచి వారిని మరో ప్రాంతానికి తరలించేవరకు బాధ్యత తీసుకున్నందుకు రూ.12లక్షల డీల్ కుదుర్చుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
శీతాకాలం సమయంలో ఉగ్రవాదులకు తన ఇంట్లో ఆశ్రయం
శీతాకాల సమయంలో ఉగ్రవాదులకు తన ఇంట్లో దవేందర్ సింగ్ ఆశ్రయం కల్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇది ఇప్పుడు కాదని కొన్నేళ్లుగా ఇది జరుగుతోందని తెలిపారు. ఇందుకోసం ఉగ్రవాదులు కావాల్సినంత డబ్బులు చెల్లిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే దవేందర్ సింగ్ ఇద్దరు ఉగ్రవాదులకు కొన్ని నెలలపాటు ఆశ్రయం కల్పించేందుకు చండీగడ్కు తీసుకెళుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం దవేందర్ సింగ్ ఆర్థిక మూలాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో తన ట్రాక్ రికార్డును పరిశీలిస్తున్నారు. త్వరలో ఈ కేసు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) టేకోవర్ చేసే అవకాశాలున్నాయి.
ఉగ్రవాదులను పాక్కు పంపేందుకు లాయర్ రఫి సహకారం
ఇక ఉగ్రవాదులతో పాటు అరెస్టు అయిన మరో వ్యక్తి రఫిని లాయరుగా గుర్తించారు. ఉగ్రవాదులు దేశం దాటేందుకు కావాల్సిన పేపర్ వర్క్ను తయారు చేస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అయితే రఫి గతాన్ని కూడా పోలీసులు తవ్వుతున్నారు. గతంలో ఏమైనా ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఉగ్రవాదులను దేశం దాటించారా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.