మహారాష్ట్రలో రూ. 142 కోట్లు, 975 ఆయుధాలు సీజ్, ఆ డబ్బు ఎవరిదంటే, సినీ తారలు !
ముంబై: మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. మహారాష్ట్రలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం ప్రముఖ బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం తొలి గంటల్లో ప్రముఖ సినీ తారలు, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాసన సభ ఎన్నికల్లో తమదే విజయం అంటూ పలు రాజకీయ నాయకులు అంటున్నారు. మహారాష్ట్రలో రూ. 142 కోట్లు, 975 ఆయుధాలు సీజ్ చేశారు.
అక్రమాస్తుల్లో డీకే ప్రపంచ రికార్డు, ట్రబుల్ షూటర్ త్రిబుల్ సెంచురి, ఈడీ!
నెమ్మదిగా సాగుతున్న పోలింగ్
మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల పోలింగ్ తొలి గంటల్లో కాస్త నెమ్మదిగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఓటు వేసేందుకు ప్రజలు భారీగా బారులు తీరినప్పటికి ఈవీఎంలు మొరాయిండం, విద్యుత్ అంతరాయంతో ఓటింగ్ ఆలస్యం అవుతోంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయని, సంబంధిత అధికారులు, సిబ్బంది వాటిని పరిశీలిస్తున్నారని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వర్షం ఇబ్బందిగా మారడంతో ఓటర్లు ఇంటికే పరిమితం అయ్యారు.
గట్టి పోలీసు బందోబస్తు
మహారాష్ట్రలో శాసన సభ ఎన్నికల పోలింగ్ సందర్బంగా ముంబై నగరంతో సహ పలు నగరాలు, పట్టణాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముంబై నగరంతో సహ పలు సున్నితమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు, సాయుధ బలగాలను రంగంలోకి దింపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పరిశీలిస్తున్నారు.
రూ. 142 కోట్లు, 975 ఆయుధాలు సీజ్
మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల సందర్బంగా అధికారులు భారీ మొత్తంలో అక్రమ నగదు, మారణాయుధాలు (తుపాకులు, గన్స్) స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ. 142 కోట్లు (నగదు), 975 మారాణాయుధాలు సీజ్ చేశామని మహారాష్ట్ర అడిషనల్ ఎన్నికల అధికారి దిలీప్ శింధె తెలిపారు. పలు ప్రాంతాల్లో నిఘా వేశామని, పోలింగ్ సందర్బంగా అనేక జాగ్రత్తలు తీసుకున్నామని ఎన్నికల అధికారి దిలీప్ శింధె వివరించారు.
ఆ నగదు ఎవరిది ?
ముంబై నగరంలోనే రూ. 29 కోట్ల అక్రమ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ముంబై నగరంతో సహా మహారాష్ట్రలో స్వాధీనం చేసుకున్న రూ. 142 కోట్ల నగదు ఎవరిది ? అనే విషయం కచ్చితంగా తెలియడం లేదని, ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు ఆరా తీస్తున్నారని ఎన్నికల కమిషన్ అధికారి దిలీప్ శింధె తెలిపారు.
ఓటర్లకు భారీ బహుమానాలు !
మహారాష్ట్రలో పోలింగ్ సందర్బంగా ఓటర్లను ఆకర్షించడానికి భారీ మొత్తంలో నగదు, బహుమతులు (గిఫ్ట్) ఇచ్చే వారి మీద నిఘా వేశామని ఎన్నికల కమిషన్ అధికారి దిలీప్ శింధె తెలిపారు. సున్నితమైన ప్రాంతాలకు సమర్థవంతమైన అధికారులు, సిబ్బందిని తరలించామని, ముంబైలోని 36 శాసన సభ నియోజక వర్గాల మీద గట్టి నిఘా వేశామని, ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదని సమాచారం వచ్చిందని ఎన్నికల కమిషన్ అధికారి దిలీప్ శింధె తెలిపారు.