కిరాణాషాపు యజమాని ఇంట్లోని రూ. 17కోట్లు, భారీగా గోల్డ్ సీజ్
తమిళనాడులోని వేలూరులో ఓ కిరాణ దుకాణం యజమాని నుంచి రూ.17 కోట్ల నగదు, భారీ మొత్తంలో బంగారాన్ని ఆదాయపు పన్నుశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఈ వార్త స్థానికంగా సంచలనంగా మారింది.
చెన్నై: తమిళనాడులోని వేలూరులో ఓ కిరాణ దుకాణం యజమాని నుంచి రూ.17 కోట్ల నగదు, భారీ మొత్తంలో బంగారాన్ని ఆదాయపు పన్నుశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఈ వార్త స్థానికంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. వేలూరులోని సత్తువాచారి గంగయమ్మ ఆలయం వద్ద కేశవ మొదలియార్ కిరాణ దుకాణం నడుపుతున్నారు. ఈయనకు సత్తువాచారిలో సుమారు 70కి పైగా ఇళ్లు ఉన్నాయి. పెద్దనోట్లు రద్దు నేపథ్యంలో నవంబర్ 24వ తేదీన కేశవ రూ.కోటితో భారీ ఎత్తున బంగారు నగలు కొనుగోలు చేశారు.
విషయం తెలుసుకున్న ఆదాయపుపన్ను విభాగం అధికారులు అదే రోజు కేశవ ఇళ్లు, దుకాణాలపై ఆకస్మిక దాడులు చేశారు. ఇంట్లోని భూగర్భ గదిలో ఉన్న రూ.17 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకొని కేశవను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.