కర్ణాటకకు రూ.1200 కోట్లు, బీహర్ రూ.200 కోట్లు.. అడిషనల్ గ్రాంట్ రిలీజ్
వర్ష బీభత్సంతో బీహర్, కర్ణాటక తదితర రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. వందల సంఖ్యలో మృతిచెందగా, కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికే ఆర్థికసాయం కేంద్ర ప్రభుత్వం అందజేసింది. అయితే కర్ణాటక, బీహర్లో పరిస్థితి దారుణంగా ఉన్నందున.. అదనపు ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.1600 కోట్లు రాష్ట్రాల గ్రాంటు కాగా.. రూ.200 కోట్లు ఎస్డీఆర్ఎఫ్ నిధులు కావడం విశేషం.
కేంద్ర హోంశాఖ ఆర్థికసాయంపై శుక్రవారం రివ్యూ నిర్వహించింది. వరద, పునరావాస చర్యల కోసం రూ.1813.75 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో సింహాబాగం కర్ణాటకకు దక్కగా, బీహార్కు కంటితుడుపు చర్యగా నిధులను కేటాయించారు. కర్ణాటకకు రూ.1200 కోట్లు, బీహర్కు రూ.400 కోట్ల చొప్పున కేటాయించారు. హోంశాఖ ప్రతిపాదనకు మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. ఈ మేరకు హోంశాఖ అధికారులు మీడియాకు తెలిపారు.
ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అదనపు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. జాతీయ విపత్తుల నిర్వహణకు కేంద్రం నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. బీహర్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ కోసం రూ.213.75 కోట్లు కేటాయిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఆయా ప్రకృతి విపత్తుల సమయంలో తొలిసారి ఎస్డీఆర్ఎఫ్కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని సంబంధిత అధికారులు చెప్తున్నారు.