ప్రతి మహిళ ఖాతాలో 25 వేలను జమ చేయాల్సిందే
పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత ప్రతి బిపిఎల్ మహిళ ఖాతాలో 25 వేల రూపాయాలను డిపాజిట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ :దారిద్ర రేఖకు దిగువను ఉన్న ప్రతి మహిళ ఖాతాలో 25 వేల రూపాయాలను జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ డిమాండ్ చేశాడు. నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను కూడ ఎత్తివేయాలని ఆయన కోరారు. 25 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన ఖాతాల వివరాలను వెల్లడించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 131 వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దుకు రెండు మాసాల ముందే రూ. 25 లక్షలకు పైగా నగదును డిపాజిట్ చేసిన వారి ఖాతాలను వెల్లడించాలని ఆయన కోరారు.
పెద్ద నగదు నోట్ల రద్దువిషయంలో ప్రధానమంత్రి ఇచ్చిన గడువు పూర్తికావోస్తోందన్నారు. ఉపాధి హమీ కూలీల వేతనాలను రెట్టింపు చేయాలని ఆయన కోరారు. చిన్నవ్యాపారులు, దుకాణదారులకు ఆదాయపు పన్ను అమ్మకం పన్నుల్లో మినహాయింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కేవలం యాభై కుటుంబాల కోసమే మోదీ పెద్ద నగదు నోట్లను రద్దుచేశారని రాహుల్ విమర్శించారు. నోట్ల రద్దుతో నల్లధనం ఎంత వెలుగులోకి వచ్చింది, ఆర్థిక వ్యవస్థ ఎంత నష్టపోయింది , ఎంత మంది చనిపోయారనే దానిపై వివరాలను వెల్లడించాలని ఆయన కోరారు.
బ్యాంకుల నుండి , ఎటిఎంల నుండి నగదు ఉపసంహరణ పరిమితిని ఎత్తివేయాలని ఆయన కోరారు. పెద్ద నగదు నోట్ల రద్దుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతుల రుణాలను మాఫీ చేయాలని, ధాన్యానికి మద్దతు ధరను 20 శాతం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.