‘టికెట్ రద్దుకు రూ.3వేలా? చాలా ఎక్కువ, తగ్గించాల్సిందే!’
విమాన ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రయాణికులపై టికెట్ రద్దు ఛార్జీలను ఎక్కువగా విధిస్తున్నారని.. వాటిని తగ్గిస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రయాణికులపై టికెట్ రద్దు ఛార్జీలను ఎక్కువగా విధిస్తున్నారని.. వాటిని తగ్గిస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే దీనిపై విమానయాన సంస్థలతో చర్చించాలని నిర్ణయించింది.
ఈ విషయంపై పౌర విమానయాన సహాయ మంత్రి జయంత్సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. 'టికెట్ రద్దుకు రూ. 3000 అంటే చాలా ఎక్కువ అని మేం భావిస్తున్నాం. చాలా సందర్భాల్లో టికెట్ ధర కంటే రద్దు ఛార్జీ ఎక్కువగా ఉంటుంది. మా ఉడాన్ పథకం కిందే గంట ప్రయాణానికి విమాన టికెట్ ధర రూ. 2500గా ఉంది. ఈ ఛార్జీలను తగ్గించి టికెట్ ధరలకు బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది' అని అన్నారు.
అంతేగాక, ఈ ఛార్జీలను సమీక్షించాలని విమానయాన సంస్థలకు త్వరలోనే సూచించనున్నట్లు చెప్పారు. ఇందుకు ఎయిర్లైన్స్ అంగీకరిస్తే.. టికెట్ రద్దు ఛార్జీలను తగ్గించే అవకాశముంది.