పొరపాటు: రూ.30వేల కోట్ల కరెన్సీని తగలబెట్టారు
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ప్రెస్లో వేల కోట్ల విలువ చేసే కరెన్సీ నోట్లను కాల్చి బూడిద చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.30వేల కోట్ల విలువ చేసే రూ.1000 నోట్లు దగ్ధం చేశారు. వీటిని తప్పుగా ప్రింట్ చేయడం వల్లే కాల్చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఈ కరెన్సీని కాల్చేయడం వల్ల నోట్ల ముద్రణకు ఉపయోగించే దాదాపు 50 టన్నుల పేపర్ బూడిదలో పోసిన పన్నీరైంది. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి నోట్లు తప్పుగా ప్రింటవడానికి కారణమైన ముగ్గురు ఆపరేటర్లను సస్పెండ్ చేశారు.
నాసిక్ ప్రింటింగ్ ప్రెస్లో వివిధ డినామినేషన్ల కరెన్సీ నోట్లను, సెక్యూరిటీ, జుడీషియల్ డాక్యుమెంట్లను ప్రింట్ చేస్తారు. ఈ ప్రెస్ను 1924లో ఏర్పాటుచేశారు.
దేశంలోని కీలక ప్రాంతాలను కలిపే రైల్వే లైను దగ్గరగా ఉండటం, వాతావరణంలో తేమ హెచ్చుతగ్గుల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకోకపోవడం.. ఈ రెండు కారణాల వల్ల ఆనాడు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటుకు నాసిక్ను ఎంచుకున్నారు.