రూ. 300 కోట్ల నకిలీ నోట్లు సీజ్, గూడ్స్ ఆటో, కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో కలకలం !
మైసూరు/బెంగళూరు: నకిలీ నోట్లు చలామణి చయ్యడానికి ప్రయత్నిస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. సుమారు రూ. 300 కోట్ల విలువైన రూ. 2, 000 నకిలీ నోట్లను కర్ణాటకలోని చామరాజనగర జిల్లా రామసముంద్ర పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో నకిలీ నోట్ల స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది.
చామరాజనగర తాలుకాలోని అట్టుగుళిపుర సమీపంలో పోలీసులు నాకాబంధి కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో అటువైపుగా వచ్చిన గూడ్స్ ఆటోను పోలీసులు నిలిపారు. పోలీసులను చూసిన వెంటనే ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.
ఆ సమయంలో పోలీసులు వెంటాడి ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. గూడ్స్ ఆటోలో పరిశీలించగా పోలీసులు దిమ్మతిరిగింది. ఆటోలో రూ. 2, 000 నోట్ల కట్టలు వెలుగు చూశాయి. రూ. 2, 000 నోట్లు పరిశీలించిన పోలీసులు అవి నకిలీ అని గుర్తించారు.
నకిలీ నోట్లు తరలిస్తున్న వ్యక్తి వివరాలు, పూర్తి సమాచారం చెప్పడానికి పోలీసు అధికారులు నిరాకరించారు. నకిలీ నోట్లను కలర్ జిరాక్స్ చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. నకిలీ నోట్లు ఎక్కడ తయారు చేశారు ?, ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ ముఠా వెనుక ఎవరు ఉన్నారు ? అనే వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో సుమారు రూ. 300 కోట్ల విలువైన నకిలీ నోట్లు బయటపడటం కలకలం రేపింది.