పనిమనుషులకు గంటకు రూ.37 చెల్లించాల్సిందే..లేదంటే జైలు శిక్షే..!
Recommended Video
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో పనిచేసే పనిమనిషికి గంటకు రూ.37 చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది. ఒక వేళ చెల్లించని పక్షంలో ఇంటి యజమానిని ఏడేళ్ల పాటు కటకటాల వెనక్కు పంపుతామని పేర్కొంది. అసంఘటిత రంగాల్లో కూడా కార్మిక సంస్కరణలు చేపట్టాలని తమిళ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే పనిమనుషులకు కనీస వేతనం గంటకు రూ.37 చెల్లించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది.
నైపుణ్యత కలిగిన వ్యక్తులకు అంటే ఇంటికొచ్చి చూసే నర్సులకు , వంట మనుషులకు, తోటమాలికి గంటకు రూ.39 చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇలా రోజుకు 8గంటలు లెక్కలోకి తీసుకుని దానికణుగుణంగా డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం చెప్పింది. బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇంటిని శుభ్రపరచడం లాంటి పనులకు నెలకు రూ. 6836 చెల్లించాలని చెబుతూ... క్వాలిఫైడ్ హోం నర్స్లకు నెలకు రూ.8,051 చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో ఆహారం, బట్టలు, ఉండేందుకు నివాసంలాంటి వాటిని మినహాయించింది.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ నేతృత్వంలో 8 మంది సభ్యుల బృందం పనిమనుషుల వేతనాలపై స్టడీ చేసి ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించింది. గతేడాది జనవరి నుంచి జూన్ వరకు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో వీరు పర్యటించి పనిమనుషులను కలిసి వారి వేతనాలపై చర్చించామని అధికారులు తెలిపారు. పనిమనుషులను 1948 కనీస వేతన చట్టం కింద కేరళ ,రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే చేర్చగా తాజాగా తమిళనాడు కూడా చేర్చడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఇక ఇప్పటి నుంచి తమిళనాడులో పనిచేసే పనిమనుషులు కూడా రెండు విధాలుగా న్యాయపరంగా పోరాడే అవకాశం ఉందన్నారు అడ్వొకేట్ డేవిడ్ సుందర్ సింగ్. గంటకు రూ.37 చెల్లించని పక్షంలో అది మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని.. ముందుగా ఒప్పందం ప్రకారం అనుకున్న మొత్తం చెల్లించకుంటే అది కార్మిక చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని న్యాయవాది డేవిడ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పనిమనుషులు ఎంతమంది ఉన్నారో ఇప్పటి వరకు తమిళనాడు ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలేదు. అయితే డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ అంచనా ప్రకారం రాష్ట్రంలో 18 లక్షల మంది ఉన్నట్లు సమాచారం.