హస్తినలో మళ్లీ సరి, బేసి.. ఉల్లంఘిస్తే రూ.4 వేల ఫైన్, పాఠశాల విద్యార్థులకు మాత్రం నో
ఢిల్లీ రహదారుల్లో సరి, బేసి వాహనాలను అనుమతి చేస్తామని హస్తిన సర్కార్ చెబుతోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ సరి, బేసి వాహనాలను అమలు చేసిన సంగతి తెలిసిందే. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు వస్తోన్న నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది.
వచ్చేనెల 4 నుంచి 15 వరకు మళ్లీ సరి, బేసి సంఖ్యను అమలు చేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశ రాజధానిలో వాహనాలన్నింటికీ అమలు చేస్తామని తెలిపారు. అయితే పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లే బస్సులు, వ్యాన్లకు మాత్రం మినహాయింపును ఇస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. వీరితోపాటు టూ వీలర్లకు కూడా మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరి, బేసి విధానం అమలులో ఉంటుందని చెప్పారు. ఆదివారం మాత్రం మినహాయింపు ఇస్తామని స్పష్టతనిచ్చారు. వీక్ డేస్ల్లో సరి, బేసి విధానాన్ని ఉల్లంఘించిన వాహనదారులకు రూ.4 వేల జరిమానా విధిస్తామని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ కొత్త విధానంతో ఇతర రాష్ట్రాలకు చెందిన రవాణేతర వాహనాలు విసృతి తగ్గుతుందని వివరించారు.
వాయు కాలుష్యం ఢిల్లీపై ప్రభావం చూపుతోంది. దీంతో సరి, బేసి సంఖ్యల కార్ల వినియోగమే దీనికి పరిష్కార మార్గమని కేజ్రీవాల్ భావించారు. గతంలో ఓసారి ప్రయోగాత్మకంగా అమలు కూడా చేశారు. ఇప్పుడు మరోసారి అమలు చేస్తామని తేల్చిచెప్పారు. దీంతో ఢిల్లీ ఓటర్ల మది దోచుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఇప్పటికే మెట్రోలో మహిళలకు ఉచిత రవాణా, ఉచితంగా మంచినీరు పంపిణీ పేరుతో కేజ్రీవాల్ వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. తర్వాత ఇప్పుడు తిరిగి సరి, బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు.