స్వయంప్రభ డీటీహెచ్: మరిన్ని ఛానళ్లు: పాఠాలు ఆన్లైన్లో: నరేగా కోసం రూ.40 వేల కోట్లు అదనం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నిలువరించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ పరిస్థితుల వల్ల అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాథమిక పాఠశాలలు, విద్యా సంస్థలు, కళాశాలలు మూతపడ్డాయి. కోట్లాదిమంది విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయ్యారు. విద్యకు దూరం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీని నుంచి గట్టెక్కడానికి తాము స్వయం ప్రభ పేరుతో ఆన్లైన్ ద్వారా విద్యను అందించే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
అయిదో విడత వివరాలు వెల్లడి..
విద్యార్థుల నుంచి లభిస్తోన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఆయా ఛానళ్ల సంఖ్యను మరింత పెంచినట్లు తెలిపారు. ఇక కొత్తగా మరో 12 ఛానళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ వివరాలను అందజేయడంలో భాగంగా వరుసగా అయిదో రోజు ఆమె విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సంబంధించిన కీలక అంశాలను వెల్లడించారు.
ఇ-విద్య, ఆ-పాఠశాల..
ప్రధానమంత్రి ఇ-విద్య, ఇ-పాఠశాల, ఇ-టెక్స్ట్బుక్స్ వంటి విధానాలను తాము అమలు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. సుదీర్ఘకాలం పాటు విద్యార్థులు కళాశాలలు, ప్రాథమిక పాఠశాలలకు దూరంగా కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. విలువైన విద్యాకాలానికి విఘాతం కల్పించకుండా ఆన్లైన్ ద్వారా పాఠాలు చెబుతున్నామని తెలిపారు. దీనికోసం స్వయం ప్రభ పేరుతో నేరుగా ఇంటికే ప్రసారం అయ్యేలా డీటీహెచ్ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు.
మే 30 నాటికి ఆన్లైన్ కోర్సుల ప్రారంభించడానికి అనుమతి..
ఈ నెల 30వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా ఆన్లైన్ కోర్సులను ప్రారంభించడానికి అనుమతి ఇచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా వంద యూనివర్శిటీలకు దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేశామని అన్నారు. వెంటనే ఆరంభించేలా చర్యలను తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఆన్లైన్ లేదా డిజిటల్ క్లాసులు ప్రారంభం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని అన్నారు.
నరేగా కోసం అదనంగా రూ. 40 వేల కోట్లు
గ్రామీణ స్థాయిలో పేదలకు ఉపాధిని కల్పించడానికి ఉద్దేశించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని భారీగా పెంచినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020-2021 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి 61 వేల కోట్ల రూపాయలను ప్రకటించామని, తాజాగా లాక్డౌన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరో 40 వేల కోట్ల రూపాయలను ఈ పథకానికి కేటాయించినట్లు తెలిపారు.
ఫ్రంట్లైన్ వారియర్ల కోసం
కరోనా వైరస్పై ఎడతెగని యుద్ధం చేయడంలో ముందువరుసలో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్కేర్ వర్కర్ల కోసం ఒక్కొక్కరికి చొప్పున 50 లక్షల రూపాయల జీవిత బీమాను ప్రకటించామని, దీనికింద 4,113 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు విడుదల చేసినట్లు వివరించారు. దేశంలో పెట్టుబడులను మరింత ప్రోత్సహించడంలో భాగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) నిబంధనలను మరింత సరళీకృతం చేశామని అన్నారు.