స్మగ్లర్ల తెలివి అతి: మటన్ కూర..వేరుశనగలు..బిస్కెట్ పాకెట్లలో రూ.45 లక్షలు: ఎయిర్పోర్టులో..!
Recommended Video
న్యూఢిల్లీ: స్మగ్లర్లు తెలివి మీరి పోయారు. విదేశీ నోట్లను తరలించడంలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వారు ఎంత అతి తెలివిని ప్రదర్శించినప్పటికీ.. దొరికి పోవడం అనేది కామన్. బంగారాన్ని కరిగించి.. బూట్ల కింద, బెల్టుల వెనుక దాచి పెట్టుకుని.. దేశాలు దాటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా- చోటు చేసుకున్న ఉదంతం భద్రతా సిబ్బందికి కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. స్మగ్లర్ల అతి తెలివిని బాహ్య ప్రపంచానికి చాటి చెప్పింది.
AP Cabinet: స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్: డబ్బు, మద్యం పంచితే అనర్హత వేటే..!
వేరుశనగ కాయలకు బదులుగా..
దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఘటన ఇది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీని పరిశీలించగా.. విదేశీ నోట్ల కట్టలు బయట పడ్డాయి. వేరుశనగలను తొలచి, అందులోని కాయలను తొలగించి, విదేశీ కరెన్సీని అమర్చారు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా వేరుశనగకాయలను యధాతథ స్థితికి తీసుకొచ్చారు. పైకి చూడ్డానికి మామూలుగా కనిపించేలా చేశారు. అలాగే- తన వెంట తెచ్చుకున్న మాంసం కూరలో, బిస్కెట్లలోనూ విదేశీ కరెన్సీని దాచి పెట్టారు. బిస్కెట్ల మధ్యలో రంధ్రాన్ని చేసి, అక్కడ నోట్లను కుక్కారు.
ఎలా అనుమానం వచ్చిందంటే..
గల్ఫ్ నుంచి వచ్చిన ప్రయాణికుడొకడు తన వెంట పెద్ద మొత్తంలో వేరుశనగలను తీసుకుని రావడం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. ఇంకెక్కడా దొరకవన్నట్లు కేజీకి పైగా వేరుశనగలను అదే పనిగా మోసుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు. భద్రతా సిబ్బంది ప్రశ్నలకు సదరు ప్రయాణికుడు బెదిరిపోయాడు. పొంతన లేని సమాధానాలను ఇచ్చాడు. దీనితో అనుమానం వచ్చిన భద్రతా సిబ్బంది.. వాటిని పరిశీలించగా నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి.
భద్రతా సిబ్బంది దిమ్మ తిరిగేలా..
స్మగ్లర్లు ఈ రకంగా కూడా అక్రమ రవాణాకు పూనుకుంటారనే విషయం ఇప్పుడే తెలిసిందని కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది (సీఐఎస్ఎఫ్) అధికార ప్రతినిధి, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ హేమేంద్ర సింగ్ అన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రతి ప్రయాణికుడినీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నామని, ఈ సందర్భంలోనే ఈ కొత్త తరహా స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. సౌదీ అరేబియాలో చలామణిలో ఉండే రియాద్, ఖతర్ రియాల్, కువైట్ దినార్, ఒమన్ రియాల్, యూరో కరెన్సీ నోట్లు లభించాయని, వాటి విలువ భారత కరెన్సీలో 45 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు.