నకిలీ నోట్ల కలకలం.. రూ.5 లక్షల విలువగల నోట్లు స్వాధీనం ... చలామణిలో రూ.20 లక్షల నోట్లు
న్యూఢిల్లీ : పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను నరేంద్ర మోడీ సర్కార్ ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. పాత నోట్లలో భద్రతా ప్రమాణాలు సరిగా లేవని .. కొత్త నోట్లను తీసుకొచ్చారు. కానీ దొంగకు వంద దారులన్నట్టు ఈ కొత్త నోట్లను కూడా ముద్రిస్తూ ఆందోళనకు గురిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో రూ.5 లక్షల నకిలీ నోట్లు పట్టుబడం కలకలం రేపుతోంది. విదేశాల్లో ముద్రించి భారత్కు తరలిస్తున్నారని విచారణలో తేలింది.
రాజధాని నడిబొడ్డున ..
దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ నోట్ల చెలామణి అంశం ప్రకంపనలు రేపుతుంది. అంతర్జాతీయ ముఠా భారత కరెన్సీని ముద్రిస్తూ సొమ్ముచేసుకుంటుంది. బంగ్లాదేశ్, నేపాల్ కూడా దేశంలోకి నగదు నోట్ల కట్టలు ప్రవేశిస్తున్నాయి. వీటిని మల్దా, పశ్చిమబెంగాల్ గుండా దేశంలోకి వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల నకిలీ నోట్ల అంశం గురించి ఢిల్లీ స్పెషల్ టీం, దక్షిణ రేంజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు నిఘా నిర్వహించారు. ఈ నెల 6న కశ్మీర్ గేట్ వద్ద గల ఐఎస్బీటీ వద్ద నకిలీ నోట్లు చేతులు మారాతాయనే సమాచారంతో అప్రమత్తమయ్యారు. అనుకున్నట్టుగానే అక్కడికి సంతోష్కుమార్ వచ్చాడు. నకిలీ నగదు మార్చేందుకు చూడగా పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.5 లక్షల విలువగల రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
అచ్చం .. నిజం నోటు లాగే ...
పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.2 వేల నోట్ల భద్రతా ప్రమాణాలు .. అచ్చం నిజమైన నోటులాగే ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వాటర్ మార్క్ కూడా చూసి ఒకింత షాక్కు గురయ్యారు. అచ్చం నిజమైన రూ.2 వేల నోటులాగా ఉండటంతో .. అసలుది ఏదో .. నకిలీది ఏదో నిర్ధారించలేకపోయామని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. గత ఆరునెలల నుంచి నకిలీ భారత కరెన్సీ నోటును దేశంలో సరఫరా చేసేందుకు అంతర్జాతీయ సిండికేట్ ముఠా రంగంలోకి దిగిందని పేర్కొన్నారు. దీంతో ఒక దర్యాప్త బృందానికి నకిలీ నోట్ల ముఠా బాధ్యతలను అప్పగించినట్టు పేర్కొన్నారు. గత ఆరునెలల నుంచి తమ టీం సిండికేట్ వ్యవస్థను పట్టుకునేందుకు శ్రమించిందని తెలిపారు. తమ బృందానికి ఈ నెల 6న నకిలీ నోట్ల నగదు మారబోతుందని సమాచారం ఉందని పేర్కొన్నారు.
పేదరికంతో ..
బీహర్లోని మోతిహరిలోగల నావల్కు చెందిన సంతోష్ .. ఆర్థిక ఇబ్బందుల్లో నకిలీ నోట్ల బృందంలో సభ్యుడిగా చేరినట్టు పోలీసులు వివరించారు. తాను విదేశాల నుంచి వచ్చే నగదును తీసుకొని .. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలో తమ ఏజెంట్లకు ఇస్తుంటానని తెలిపారు. రూ.100 నకిలీ నోటుకు తాను రూ.40 చెల్లిస్తానని చెప్పారు. అయితే ఏజెంట్లకు రూ.50 నుంచి రూ.60కు ఇస్తుంటానని చెప్పారు. ఇప్పటివరకు రూ.20 లక్షల నకిలీ నోట్లను అందజేశానని తెలిపారు. సంతోష్ పేద కుటుంబానికి చెందినవాడు కావడంతో .. నకిలీ నోట్ల ముఠాలో సభ్యుడిగా దిగారు. అతనికి పెళ్లైంది. ఓ బిడ్డ కూడా ఉండటంతో .. సంసార భారం నెత్తిన పడటంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు నకిలీ నోట్లను ఇస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు.