50 కోట్లిస్తే మోడీని చంపేస్తా వీడియో వైరల్ ..షాక్ లో బీజేపీ .. ఆడియో మార్చారంటున్న తేజ్ బహదూర్
ఒకపక్క ఎన్నికల హడావిడిలో దేశం ఉంటే ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానని మాజీ జవాన్ తేజ్ బహదూర్ మాట్లాడినట్టుగా ఉన్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో రాజకీయ వర్గాలు షాక్ కు గురయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీపై వారణాసిలో పోటీకి దిగిన బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు పెను సంచలనమైంది. తనకు రూ.50 కోట్లు ఇస్తే ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తానని తేజ్ బహదూర్ ఆ వీడియోలో పేర్కొన్నట్టుగా ఉంది . ఇప్పుడు దీనిపై దేశ వ్యాప్త చర్చ జరుగుతుంది.
మోడీపై నామినేషన్ వేసిన తేజ్ బహదూర్ .. నామినేషన్ తిరస్కరణ
ఈ ఎన్నికల్లో తేజ్ బహదూర్ సమాజ్ వాదీ పార్టీ టికెట్పై వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. మోడీపై పోటీకి దిగిన ఆయన నామినేషన్ ను ఈసీ తిరస్కరించింది.సమాజ్వాదీ పార్టీ మోదీపై ఎన్నికల బరిలోకి దింపిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్కు ఈసీ షాకిచ్చింది. సరైనపత్రాలు సమర్పించలేదన్న కారణంతో ఆయన నామినేషన్ను తిరస్కరించింది. నామినేషన్ పత్రాల్లో ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ అయినట్లు పేర్కొనలేదు. దీంతో ఆయన నామినేషన్ ను తిరస్కరించింది .
50 కోట్లు ఇస్తే మోడీని చంపేస్తానన్న తేజ్ బహదూర్ వీడియో .. రెండేళ్ళ క్రితం వీడియోలో ఉంది తానే అని ఒప్పుకున్న మాజీ జవాన్ , ఆడియో మార్చారని ఆరోపణ
ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానని తేజ్ బహదూర్ అన్న మాటల వీడియో తనదేనని తేజ్ బహదూర్ తెలిపారు. ఇక రెండేళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న ఈ వీడియోలో ఉన్నది తానేనని తేజ్ బహదూర్ అంగీకరించాడు. అయితే, దీని వెనుక ఏదో కుట్ర ఉందని ఆ వీడియోలో ఉన్న కంటెంట్ మాత్రం తానూ మాట్లాడింది కాదని అది మార్చబడింది అని ఆయన ఆరోపిస్తున్నారు. ఓ స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు ఉన్న ఈ వీడియోలో తాను ఎన్నో విషయాలు మాట్లాడానని కానీ ప్రధాని మోడీకి సంబంధించి ఎలాంటి విషయాల చర్చ జరగలేదని ఆయన పేర్కొన్నారు. అయితే తన వీడియో మార్చబడింది అని తేజ్ బహదూర్ చెప్తున్న దానిలో తనకు ఎవరైనా రూ.50 కోట్లు ఇస్తే మోడీని చంపేస్తానని బహదూర్ అన్నట్లుగా స్పష్టంగా వినిపిస్తోంది. అయితే, వీడియో రెండేళ్లనాటిది కావడంతో, అది ఆడియో మార్ఫ్ చెయ్యబడింది అని బహదూర్ చెప్పటంతో దాని విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ళ క్రితం వీడియో ఇప్పుడు ఎన్నికల సమయంలో బయటకు రావటం వెనుక కుట్ర ఉందని తేజ్ బహదూర్ అంటున్నారు.
కాంగ్రెస్ ప్రోద్బలంతో మోడీని చంపే కుట్ర .. తేజ్ బహదూర్ సంఘ విద్రోహ శక్తి అన్న బీజేపీ నేత జీవీఎల్
ఇక సంచలనం సృష్టిస్తున్న మోడీని చంపేస్తానన్న వీడియోపై బీజేపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు . తేజ్ బహదూర్ ఒక సంఘ విద్రోహ శక్తి అని , ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల వెనక ఉన్నది కాంగ్రెస్సేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మోడీపై నామినేషన్ వేసిన వ్యక్తే ఆయన హత్యకు కుట్ర పన్నడం నిజంగా షాకింగ్ అని ఆయన పేర్కొన్నారు . మోడీని ఎదుర్కోలేకే ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి హింసా మార్గాలను ఎంచుకుంటున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రోద్బలంతోనే తేజ్ బహదూర్ కుట్ర చేశాడని జీవీఎల్ అంటున్నారు.