నాలాలో నోట్ల కట్టలు.. అయినా కన్నెత్తి చూడని జనం.. ఎందుకో తెలుసా?
కాన్పూర్ : ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో గోవింద్ నగర్ ప్రాంతం. ఉదయమే ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులు నాలాను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నాలో పేరుకుపోయిన చెత్త తొలగిస్తుండగా వారికి ఒక బ్యాగు కనిపించింది. అందులో ఏదో ఉందన్న అనుమానంతో బయటకు తీసిన చూసిన వారు ఆశ్చర్యపోయారు. బ్యాగు నిండా నోట్ల కట్టలు. అంత డబ్బు దొరికితే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ వారు మాత్రం ఆ సొమ్ము ముట్టుకునేందుకు సాహసం చేయలేదు.
నెటిజన్లను కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ అధికారిణి నేపథ్యం.. ఆసక్తికరం
నాలాలో దొరికిన పాత రూ.500నోట్లు
పారిశుధ్య కార్మికులకు నాలాలో దొరికిన నోట్ల కట్టలు రద్దైన రూ.500నోట్లు కావడమే అందుకు కారణం. బ్యాగులో ఉన్న నోట్లన్ని పాత ఐదు వందల రూపాయలవి కావడంతో ఎవరూ వాటిని తీసుకునేందుకు ఇష్టపడలేదు. పారిశుధ్య సిబ్బంది ఆ డబ్బును లెక్కపెట్టగా రూ.3లక్షలుగా తేలింది. నోట్ల కట్టలు బయటపడ్డ విషయం ఆ నోటా ఈ నోటా చుట్టుపక్కల వారికి తెలిసింది. అక్కడికి వచ్చిన జనం నోట్ల కట్టల ఫొటోలు, వాటితో సెల్ఫీలు తీసుకున్నారే తప్ప ఎవరూ ఒక్క రూపాయి ముట్టుకోలేదు.
నోట్ల రద్దు సమయంలో
నాలాలో దొరికిన పాత రూ.500 కరెన్సీ కట్టలను నోట్ల రద్దు సమయంలో నాలాలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. లెక్కలు చూపని డబ్బు కావడం వల్లేవాటిని పారేసి ఉంటారని స్థానికులు అంటున్నారు. పనికిరాని పాత నోట్లు కావడంతో జనం ఎవరూ వాటిని తీసుకునేందుకు ఇష్టపడలేదు. అయితే కొందరు మాత్రం గుర్తుగా తమ దగ్గర పెట్టుకునేందుకు ఒకట్రెండు నోట్లు తీసుకెళ్లారు.
పోలీసులకు తెలియదట
నాలాలో నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదంటున్నారు గోవింద్ నగర్ పోలీసులు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల ఆధారంగా దర్యాప్తు చేస్తామని అధికారులు ప్రకటించారు.