కాఫీడే కింగ్ అక్రమాస్తుల విలువ రూ. 650 కోట్లు, మాజీ సీఎం అల్లుడామజాకా, ఐటీ సోదాల్లో !
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ అల్లుడు, కాఫీడే కంపెనీల యజమాని వీజీ సిద్దార్థ్ అక్రమ ఆస్తులు రూ. 650 కోట్లకు పైగా ఉన్నాయని ఆదాయపన్ను శాఖ అధికారులు అంటున్నారు.
బెంగళూరు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ అల్లుడు, కాఫీడే కంపెనీల యజమాని వీజీ సిద్దార్థ్ అక్రమ ఆస్తులు రూ. 650 కోట్లకు పైగా ఉన్నాయని ఆదాయపన్ను శాఖ అధికారులు అంటున్నారు. సోమవారం సిద్దార్థ్ కంపెనీలు, నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు పూర్తి చేశారు.
కాఫీడే కంపెనీల యజమాని సిద్దార్థ్ గతంలో అధికారికంగా ప్రకటించిన దాని కంటే రూ. 650 కోట్ల విలువైన ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని ఆదాయపన్ను శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం నుంచి సిద్దార్థ్ కు చెందిన కాఫీడే కంపెనీల కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు మొదలు పెట్టారు.
బెంగళూరు నగరంలోని విఠల్ మల్యా రోడ్డులోని కాఫీడే కంపెనీ ప్రధాన కార్యాలయంలో, సిద్దార్థ్ కు చెందిన సదాశివనగర్ లోని ఇంటిలో, హాసన్, చిక్కమగళూరు, చెన్నై ముంబైలోని కాఫీడే కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు.
కాఫీడే సంస్థలతో పాటు సిద్దార్థ్ కు అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఆయన అధికారికంగా ప్రకటించిన ఆస్తుల కంటే రూ. 650 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నాయని వెలుగు చూసిందని ఆదాయపన్ను శాఖ అధికారులు అంటున్నారు. ఇటీవల కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు.
మంత్రి డీకే శివకుమార్ సన్నిహితుడు నిరంజన్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. నిరంజన్ ఇంటిలో సోదాలు చేసిన సమయంలో కొన్ని విలువైన పత్రాలు చిక్కాయని, వాటి వివరాల ఆధారంగా కాఫీడే కంపెనీ యజమాని సిద్దార్థ్ కార్యాలయాల్లో సోదాలు చేశారని సమాచారం. ఈ విషయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ, ఆయన అల్లుడు సిద్దార్థ్ కానీ ఇప్పటి వరకు బహిరంగంగా స్పంధించలేదు.