బ్లాక్ మనీ? రూ. 71 లక్షల రూ.2,000 నోట్లు సీజ్
ఉడిపి: అక్రమంగా తరలిస్తున్న రూ. 71 లక్షల రుపాయల( అన్నీ రూ. 2,000 నోట్లు)ను ఉడిపి జిల్లాలోని కర్కాళ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళూరులోని కుద్రోళి ప్రాంతానికి చెందిన ఇమ్రాన్, ఆసీఫ్, దీపక్ అనే ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
శుక్రవారం కేఏ-19ఎంఏ, 7639 నెంబర్ ఉన్న ఫోర్డ్ కారులో నిందితులు వాయువేగంగా వెలుతున్న సమయంలో పోలీసులు వారిని వాహనం నిలపాలని సూచించారు. అయితే ఆముగ్గురు కారులో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు.
పోలీసులకు అనుమానం వచ్చి వారిని వెంబడించారు. కారు అడ్డుకుని వాహనంలో క్షుణ్ణంగా పరిశీలించారు. కారులో రూ. 71 లక్షల విలువైన రూ. 2,000 నోట్లు కనపడటంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల దగ్గర నగదుకు సంబంధించి ఎలాంటి దృవీకరణ పత్రాలు లేవని, నిందితులు ముగ్గురు పొంతనలేని సమాధానం ఇస్తున్నారని కార్కాళ పోలీసు అధికారి జాన్ ఆంటోని చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రూ. 71 లక్షలు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులకు అప్పగించామని పోలీసు అధికారి జాన్ ఆంటోని తెలిపారు.